మెదక్ మున్సిపాలిటీ, జూన్ 6 : పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు సులోచన ప్రభురెడ్డి, రాగి వనజ, సమియొద్దీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరితో కలిసి వార్డుల్లో పర్యటించి, ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్లో జిల్లా కేంద్రం ఏర్పడడంతో పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నదని దానికనుగుణంగా పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించుకోబోతున్నామని తెలిపారు. ప్రధాన రోడ్లను సైతం విస్తరిస్తున్నామని వెల్ల డించారు. ప్రధాన చౌరస్తాలు ఏర్పాటయ్యాయని, త్వరలో సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా పట్టణంలోని ఇంటర్నల్ రోడ్లు, మురుగు కాల్వలను నిర్మిచుకోవాల్సి ఉన్నదని, పట్టణ అభివృద్ధికి రూ. 20 కోట్లు అవసరమని, ముఖ్యమంత్రితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా ఇన్చార్జి మంత్రి హరీశ్రావులను కోరామని తెలిపారు.
టీయూఐఎఫ్డీసీ ద్వారా నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారని చెప్పారు. 13వ వార్డులో అంతర్గత సీసీ రోడ్లకు రూ. 10 లక్షలు, ఆర్అండ్బీ రోడ్లకు రూ.10 లక్షల ప్రతిప్రాదనలు తయారు చేయాలని మున్సిపల్ ఆధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా పల్లె, పట్టణ ప్రగతితో పరిసరాలు శుభ్రం చేయడం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతను అందరూ పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్, సుంకయ్య, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్ధేశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ బట్టి చంద్రమోహన్, వార్డుల ప్రత్యేకాధికారులు, టీఆర్ఎస్ నాయకులు, లింగారెడ్డి, సుమన్, బొద్దుల కృష్ణ, మధు, ప్రభురెడ్డి, సునీల్ తదితరులు పాల్గ్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత..
పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా అందరూ గుర్తించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హీరో షోరూం ఆధ్వర్యంలో ఫ్రీ పొల్యూషన్ చెకింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాహనాలు వెదజల్లే వాయు కాలుష్యాన్ని తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి ఆరోగ్యకర సమాజానికి పాటు పడాలన్నారు. అనంతరం ద్విచక్ర వాహనాదారులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమలో మున్సిపల్ చైర్మన్ చంద్రపా ల్, షోరూం నిర్వాహకులు బండ నరేందర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.