శివ్వంపేట/ నిజాంపేట/ రామాయంపేట రూరల్, మే 18 : శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేణుగోపాలస్వామి రథోత్సవ కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. వేణుగోపాలస్వామి ఆలయం నుంచి స్వామివారిని పల్లకీలో తెచ్చి పూలతో అలంకరించిన రథంలో ఊరేగించారు. ఆలయ ధర్మకర్తలు దొంతిదొర రాజాసురేందర్రెడ్డి వంశీకులు శ్రావణ్కుమార్రెడ్డి, అమరేందర్రెడ్డి, సంజయ్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్ ఫణిశశాంక్శర్మ, ఉపసర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ లక్ష్మీకుమార్, మగ్దుంపూర్ సర్పంచ్ సోము అశోక్, మండల కోఆప్షన్ సభ్యుడు లాయక్, నాయకులు పిట్ల సత్యనారాయణ, ఉమాలక్ష్మీకాంతరావు, ఆముద యాదగిరి, వం జరి కొండల్, భవన్నగారి శ్రీనివాస్, బుద్దుల భిక్షపతి, షఫియొద్ద్దీన్, పవన్కుమార్గుప్తా, రామచంద్రంగౌడ్, సామలవెంకటేశ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆలయానికి మైక్సెట్ అందజేసిన జడ్పీటీసీ
దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి రూ. 40వేల విలువ చేసే మైక్సెట్ను స్థానిక జడ్పీటీసీ మహేశ్గుప్తా అందజేశారు. ఆలయాల అభివృద్ధికి స్థానికులతోపాటు దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్ ఫణిశశాంక్శర్మ, నేతలు సత్యనారాయణ, లాయక్, శ్రీనివాస్గుప్తా ఉన్నారు.
నార్లపూర్లో పెద్దమ్మతల్లి ప్రతిష్టాపన ఉత్సవాలు
నిజాంపేట మండలంలోని నార్లపూర్ గ్రామంలో పెద్దమ్మఆలయంలో ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలను ఘనంగా నిర్వ హించారు. ఆలయ శిఖర కలశాన్ని ముదిరాజ్ సంఘం సభ్యు లు గ్రామంలో ఊరేగించారు. వేద పండితుడు రామ్మోహన్శర్మ మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపు వైభవంగా జరిగింది.
నేటినుంచి అక్కన్నపేటలో పెద్దమ్మ జాతర
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో పెద్ద మ్మ జాతర గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19న ఉదయం పుణ్యాహావచనం, నవగ్రహ హోమం, ఆరాధన, పూర్ణాహుతి, కుంకుమార్చన, సాయంత్రం పోచమ్మ బోనాల ఊరేగింపు, 20న అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు, పెద్దమ్మ, పెద్దిరాజుల కల్యాణం, సాయంత్రం పెద్దమ్మ బోనాల ఊరేగింపు, 21న ఎడ్ల బండ్ల ఊరేగింపు, అన్నదానం నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ ఆలయ 14వ వార్షికోత్సవాలకు భక్తులు భారీగా తరలిరావాలని కోరారు.