మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు ఆందోళన చెందొద్దని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అకాల వర్షాలపై ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ సోమవారం హైదరాబాద్లోని పౌరసరఫరాల భవన్లో అధికారులతో సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఏ మాత్రం ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలపై జిల్లాస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, దీని ప్రభావం రైతులపై ఏ మాత్రం పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకొని వివరాలను ఆన్లైన్లోనమోదు చేయాలని ఆదేశించారు.
20 లక్షలు దాటిన ధాన్యం కొనుగోళ్లు…
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సజావుగా సాగుతుందని, ధాన్యం కొనుగోలు, మద్దతు ధర, తరుగు తదితర అంశాలపై రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందడంలేదని, అయితే ప్రతిపక్షాలు ఏదో జరుగుతుందన్నట్లు రైతులను భయాందోళనలకు గురిచేసే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 6257 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇపపటి వరకు 2.87 లక్షల మంది రైతుల నుంచి రూ.3,633 కోట్ల విలువ చేసే 20.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
తరుగు తీస్తే కఠిన చర్యలు…
తాలు, తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. అవసరమైతే బ్లాక్ లిస్టులో పెట్టడానికి వెనుకాడబోమని అన్నారు. కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించిన తర్వాత, అక్కడ తాలుపేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తం గా ఉండి రైతులకు నష్టం జరుగకుండా చూడాలన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యే క నిఘా ఉంచాలని సూచించారు. మెదక్ జిల్లాలో 341 కొనుగోలు కేంద్రాలకు గాను 335 ప్రారంభించామని జిల్లా అధికారులు తెలిపారు. 14,561 మంది రైతుల నుంచి రూ.190 కోట్ల విలువ గల లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ఇందుకోసం 25 లక్షల గన్నీ బస్తాలను ఉపయోగించగా, 16 లక్షలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పౌర సరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ట్రాన్స్పోర్టు కాంట్రాక్ట్ ప్రతినిధులు వీరేశం, నాగభూషణం పాల్గొన్నారు.