దుబ్బాక టౌన్, ఏప్రిల్ 28 : ఆయిల్పామ్ లాభసాటి పంట అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడంతో రైతులంతా సాగుకు ముందుకు రావాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం దుబ్బాక మండలం పోతారెడ్డిపేటలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి 50 మంది లబ్ధిదారులతో మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం పోతారెడ్డిపేట క్లస్టర్ రైతు వేదికను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆయిల్పామ్ ఎగుమతులను నిషేధం విధించడంతో దేశంలో వంటనూనెల కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ఏటా లక్ష కోట్ల విలువైన పామాయిల్ను ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. దిగుమతులపై ఆధారపడితే ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఆయిల్పామ్ పంటకు చీడపీడలు, కోతు లు, పందుల బెడద ఉండదన్నారు. నెలనెలా ఆదాయం పొం దవచ్చన్నారు. తెలంగాణలో మొదటి ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏర్పాటు చేయగా, రెండోది సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ఫెడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్ సా గు చేస్తే రైతులు ధర రాదని, కొనుగోలు జరగదని అనుమాన పడవద్దన్నారు. దేశంలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసే అవకాశం ఉందని, సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ నర్సరీని ఏర్పాటు చేసి 20వేల ఎకరాలకు కావాల్సిన తోటల పెంపకం చేపట్టామన్నారు. జూలై నుంచి ఆయిల్పామ్ ప్లాంటేషన్ కోసం రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీని ఇస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు మొదటగా ముందుకు వచ్చిన రైతులను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సాగు వివరాలు తెలుసుకునేందుకు సత్తుపల్లి పర్యటనకు పంపిస్తామని తెలిపారు. జిల్లాలో ఈఏడాది 30శాతం పొలాల్లో పచ్చిరొట్టె విత్తనాలు సాగయ్యేలా చూడాలన్నారు. పెసర, జనుము, జీలుగు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలో నకిలీ విత్తనాల బెడద లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోతారెడ్డిపేట క్లస్టర్ పరిధిలో ఈ ఏడాది 200 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపిన ఏఈవోలు అనూష, కవితను మంత్రి హరీశ్రావు ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో జేడీ శివప్రసాద్, ఏడీ శ్యామ్సుందర్, ఏవో ప్రవీణ్ ఉన్నారు.
సాధారణ కాన్పులను ప్రోత్సహించాలి…
వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి హరీశ్రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని గురువారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి డ్యూటీ డాక్టర్ల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది గురించి ఆరాతీశారు. దవాఖానలో అన్ని రకాల మందులు ఉన్నాయని తెలుసుకున్న మంత్రి, మందులు లేవనే మాట రావద్దని సూచించారు. దవాఖానలో నా ర్మల్ డెలివరీలు జరిగేలా చొరవ చూపాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పించాలన్నారు. జ్వ రం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న రోగికి కచ్చితంగా కరోనా టెస్టు చేయాలన్నారు. ఓపీ, ఔట్ పేషెంట్ రిజిస్టర్లను మంత్రి తనిఖీ చేశా రు. మంత్రి వెంట మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఉన్నారు.
చకచకా సాగిన మంత్రి పర్యటన…
దుబ్బాక నియోజకవర్గంలో గురువారం మంత్రి హరీశ్రావు పర్యటన చకచకా సాగింది. రాయపోల్, తొగుట మండలాల్లో కస్తూర్బాగాంధీ పాఠశాలలను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. దుబ్బాక మండలంలోని పోతారెడ్డిపేటలో 50 డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతు వేదిక, గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన అనంతరం మిరుదొడ్డిలో కస్తూర్బా పాఠశాల, రైతువేదిక, భూంపల్లిలో గ్రామపంచాయతీ భవనం, రైతువేదిక ప్రారంభోత్సవం, పీహెచ్సీ భవనానికి శంకుస్థాపన చేశారు. దుబ్బాక మండలంలోని హబ్షీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి, ప్రాథమిక పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చేర్వాపూర్ వార్డులో 20డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అనంతరం దుబ్బాకలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జట్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్రెడ్డి, పీఏసీహెచ్ చైర్మన్ శేర్ల కైలాశ్ , ఏఎంసీ చైర్మన్ బండి శ్రీలేఖరాజు, వైస్ చైర్మన్ రాజాలక్ష్మణ్రావు, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత, కౌన్సిలర్ మూర్తి సంధ్యారాణి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు శ్రీనివాస్, శంకర్, టీఆర్ఎస్ నాయకులు రొట్టె రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు సేవకులం
వారిని కాపాడాల్సిన బాధ్యత మనదే మెరుగైన సేవలు అందించాలి
మనమంతా ప్రజలకు సేవకులం, వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వైద్యాధికారులకు, సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. గురువారం మిరుదొడ్డి మండలం భూంపల్లి పీహెచ్సీ నూతన భవన నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావుతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మంత్రి మాట్లాడుతూ…మీ పీహెచ్సీలో ఎంతమంది గర్భిణులు ఉన్నారు. వీరిలో ఎంతమంది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారని ఆరాతీశారు. ప్రజలతో మమేకమై పని చేయాలని, వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని మంత్రి సూచించారు. వైద్య సిబ్బంది కరోనా సమయంలో కష్టపడి పనిచేశారని, అదే స్ఫూర్తితో ప్రభుత్వం అందించే వైద్య సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేయాలన్నారు. షుగరు, బీపీ మందులు ఉచితంగా అందిస్తున్నామని, పెద్దాపరేషన్ చేసి గర్భసంచి తీసే వ్యాపారం చేయవద్దన్నారు. అలాంటివి బంద్ కావాలన్నారు. మహిళల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యతను తీసుకొని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. పాముకాటు, తేలుకాటు మందులు , సూదులు ఉన్నాయా అని మంత్రి ఆరాతీశారు.రోగులు తక్కువ.. ఉద్యోగులు ఎక్కువ…21 మంది సిబ్బందికి 21 మంది రోగులు ఉంటారని అని మంత్రి హరీశ్రావు సిబ్బందిని సుతిమెత్తగా మందలించారు.