హుస్నాబాద్ టౌన్, నవంబర్ 26: రిటైర్మెంట్ అయినప్పటికీ వారు ఉద్యోగం చేసిన స్థలానికి నిత్యం ఠంఛన్గా చేరుకుంటారు. ఒకరిద్దరు కాదు దాదాపు ఇరవై మంది వరకు రోజు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. వారు కలుసుకునే వేదికే హుస్నాబాద్ ఆర్టీసీ బస్స్టాండ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్డిపోలో పనిచేసి రిటైర్మెంట్ అయిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు రోజు వారి జీవనశైలిలో భాగంగా నిత్యం బస్స్టాండ్కు చేరుకుంటారు. అక్కడి చెట్లకింద ఉన్న బెంచీల్లో కూసోని ముచ్చట్లు పెట్టుకోవడం కొన్నేండ్లుగా ఆనవాయితీగా మారింది. వీరంతా ఉద్యోగ విరమణ చేసినా వీరి కలయిక మాత్రం ఆగడం లేదు.
బస్స్టాండ్తో అనుబంధాన్ని వీడకుండా…
ఏండ్ల తరబడి చేసిన ఉద్యోగంతో ఆర్టీసీ బస్సులు, బస్టాండ్తోని ఏర్పడిన అనుబంధాన్ని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మరిచిపోలేకపోతున్నారు. వృత్తిలో అంకితభావంతో పనిచేసిన సంస్థ వద్దకు నిత్యం రావడం, తెలిసిన వారికి ఏ బస్సు ఎన్నిగంటలకు వస్తుందో చెప్పడం, ఎన్ని గంటలకు ఏ బస్సు వెళ్తుందో చెబుతుంటారు. బస్స్టాండ్లోకి ప్రైవేట్ వాహనాలు రాకుండా అడ్డుకుంటారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా సూచనలు చేస్తుంటారు. ఇలా ఆర్టీసీ బస్లతో ఏర్పడిన అనుబంధాన్ని నేటికి వదులుకోకుండా ఆ ప్రాంతంలోనే రోజుకు రెండుగంటలకు పైగా గడుపుతున్నారు ఈ ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు.
కష్టసుఖాలు పంచుకుంటూ..
నిత్యం హుస్నాబాద్ ఆర్టీసీ బస్స్టాండ్లోని చెట్లకింద కలుసుకుంటున్న ఈ ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులు తమ కుటుంబాల కష్టసుఖాలను ఒకరినొకరు పంచు కుంటారు. ఆర్టీసీ రిటైర్ ఉద్యోగులు శంకర్, రాజయ్యగౌడ్, పెద్ద కనకయ్య, చిన్న కనకయ్య, యూఎల్రెడ్డి, రాజయ్య, మల్లేశం, రాజేందర్, శ్రీనివాస్గౌడ్, సత్తయ్య, మల్లేశంతో పాటు పలువురు నిత్యం బస్స్టాండ్లో కలుసుకుని తమ అనుబంధాలను పంచుకుంటున్నారు. వీటితో పాటు ఆర్టీసీ బస్సులు నడుస్తున్న తీరు, సంస్థ విశేషాలు, బస్స్టాండ్కు వస్తున్న వారితో మాట్లాడంతో పాటు పిల్లల ఉద్యోగాలు, కుటుంబాల పరిస్థితులను నెమరువేసుకుంటారు. పైగా తమ ఇండ్లలో జరిగే ఫంక్షన్లకు అందరినీ ఆహ్వానించుకోవడంతో పాటు ఆనందంగా గడుపుతుంటారు.
శంకర్ ఏడున్నవు…నేను వచ్చినా… ఈడనే బస్టాండ్ కాడనే ఉన్న. మన కనకయ్య, రాజన్న అందరం అచ్చినం. ఎక్కడున్నవు అంటూ ఫోన్లో తనవాళ్ల రాకకోసం పిలుపులు.. ఇలా నిత్యం ఆ ప్రాంతంలో కలుసుకుని ఒకరినొకరు యోగక్షేమాలు పంచుకుంటారు. ఒక చాయ్ తాగేసి మళ్లీ ఎవరి
ఇంటిదారి వారు పడుతారు. ఉద్యోగ విరమణ చేసినా ఆర్టీసీ కార్మికులు నిత్యం బస్టాండ్తో పంచుకుంటున్న అనుబంధమిది. నిజమైన దోస్తానా, ప్రేమామాభిమానాలను తెలియజేస్తున్నది వీరి కలయిక.
ఆర్టీసీ సంస్థ కార్యకలపాలు తెలుసుకుంటూ…
రిటైర్మెంట్ అయినప్పటికీ ఆర్టీసీ సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలను నిత్యం తెలుసుకుంటారు వీరంతా. ఆలాగే ఆయా ప్రాంతాల్లో రిటైర్డ్ కార్మికుల సమావేశాలకు హాజరవుతూ ఆ సమస్యలు పరిష్కారమైతే ఎలా మేలు జరుగుతుందో సైతం చర్చించుకుంటారు. స్థానిక డిపోతో పాటు బస్స్టాండ్లోని పరిస్థితులను గమనిస్తూ వారికి ఉన్న అనుభవాలను అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్తుంటారు.
బస్స్టాండ్కు వస్తే మనసు నిమ్మలంగా ఉంటది..
రోజు బస్స్టాండ్కు వస్తే మా మనసు నిమ్మలంగా ఉంటది. అందరం కలుసుకుని ముచ్చట్లు మాట్లాడుకుంటుంటే బాధలన్నీ మరిచిపోతం. అన్న నమస్తే అని తెలిసన వారు ఈడ పలకరించుకుంట పోతుంటే ఆ సంతోషమే వేరు. డ్రైవర్గా పనిచేసిన క్రమంలో బస్సుల కూర్చునే సందులేక టాప్మీద కూసున్న రోజుల్లో అందరినీ తీసుకుపోయి వాళ్ల ఊళ్లల దించి వచ్చేది. ఇప్పుడు బస్సులల్ల జనంలేక కొన్నిసార్లు ఖాళీగా పోతున్న బస్సులను చూసి కొద్దిగ బాధనిపిస్తుంది.
-బండి శంకర్, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుడు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
ఐదుగంటలకు వచ్చి అందరికీ ఫోన్చేస్త…
ఐదుగంటకు బస్స్టాండ్కు వస్త. రాంగనే దోస్తలందరికీ ఒకలెనక ఒకలకు ఫోన్చేస్త. అందరం రాంగనే ఇవ్వాల ఎటుపోయినవు అని అనుకుంటం. ఓపారి చాయ్తాగుతం. ఏడున్నర దాక ఈడనే బస్స్టాండ్లోనే ఉంటం.
– బొమ్మగాని రాజయ్యగౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుడు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
ఈడికి రోజు వస్తం…
బస్స్టాండ్కు రోజు అందరం వస్తం. ఈడ చెట్లకింద కూసోని అందరం ఆనందంగా గడుపుతం. ఎవ్వలకు ఏం ఇబ్బందులు ఉన్నా చెప్పుకుంటం. రోజు ఈడికి రాకుండ ఉండలేం. మాకోసం దాతలు ఉచితంగా బెంచీలు కూడా ఇచ్చిండ్రు. ఈ బస్టాండ్ల ఉంటే మమ్మల్ని చూసి అందరూ నమస్తే అన్న అంటూ పలకరిస్తరు.
-యు.ఎల్రెడ్డి,ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుడు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
మా సంస్థకు బాగుండాలి..
రోజు అందరం కలుసుకుని అన్ని విషయాలు చెప్పుకుంటం. మేము పనిచేసిన సంస్థ కాబట్టి మా వంతు సహకారం ఇప్పటికీ ఆర్టీసీ అందిస్తున్నం. మాసంస్థ సల్లగుంటనే మేము సల్లగుంటం. అందుకనే బస్స్టాండ్కు వచ్చి ప్రైవేట్ వాహనాలు వస్తే ఎల్లగొడుతం. పాతసార్లు వస్తేవారిని కలవడం, రిటైర్మెంట్ అయ్యే కార్మికులకు అందరం కలిసి పోయి సన్మానం చేస్తం.
– ముప్పిడి రాజిరెడ్డి, రిటైర్డ్ ఆర్టీసీ
కార్మికుడు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
ఈడకు రాంగనే అన్ని మరిచిపోతం…
ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఉన్నా.. బస్టాండ్కు రాంగనే అన్ని మరిచిపోతం. ఈడకు ఎవ్వలు అధికారులు వచ్చినా వాళ్లు ఎవలు అని మమ్మల్ని పిలుచుకోని ఆత్మీయంగా మాట్లాడుతరు. అందరం కలుసుకోవడం మాకు సంబురంగా ఉంటది. ప్రయాణికులకు మావంతుగా సహకరిస్తాం. సంస్థ గురించి ఇక్కడ నిత్యం మాట్లాడుకుంటాం.
– ఎండీ అఫ్జల్, ఆర్టీసీ కార్మికుడు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)