కంది, నవంబర్ 26: అబద్ధాల పునాదులపై ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. శనివారం కంది మండలంలోని ఉత్తర్పల్లి, మక్త అల్లూర్, చిమ్నాపూర్, కాశీపూర్, కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్కల్ గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అదనంగా కలివేముల గ్రామంలో రూ.17 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్, రూ.8 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ బురదజల్లాలనుకోవడం అవివేకమన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేసిందేమీ లేదని, మాటలు తప్పా చేతలు లేవని విమర్శించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. 24గంటల పాటు విద్యుత్ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. సీఎం కేసీఆర్ నారాయణ్కేడ్ సభలో చెప్పినట్లు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఆ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతిఒక్కరూ అండగా నిలువాలన్నారు. చింతాకు గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కంది ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు బాలయ్య, నాగరాజు, కవితా మధుసూదన్రెడ్డి, నాయకులు రాంరెడ్డి, నందకిశోర్, ఖాజాఖాన్, విఠల్ పాల్గొన్నారు.