రైతులకు తెల్లబంగారమైన పత్తి కాసులు కురిపిస్తున్నది. పత్తి క్రయవిక్రయాలు ప్రారంభం నాటి నుంచి రోజురోజుకూ ధర ఊహిచని విధంగా పెరుగుతూ రైతుల్లో ఆశలు నింపుతున్నది
కాసులు కురిపిస్తున్న పత్తి పంట
గజ్వేల్ మార్కెట్యార్డులో క్వింటాల్కు రూ.9330
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 38,707 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు పూర్తి
గజ్వేల్ మార్కెట్ యార్డుతో పాటు 24 పత్తి మిల్లుల్లో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 1,16,814ఎకరాల్లో పత్తిపంటసాగు
గజ్వేల్ మార్కెట్కు 99,292 మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం
గజ్వేల్, నవంబర్16 : రైతులకు తెల్లబంగారమైన పత్తి కాసులు కురిపిస్తున్నది. పత్తి క్రయవిక్రయాలు ప్రారంభం నాటి నుంచి రోజురోజుకూ ధర ఊహిచని విధంగా పెరుగుతూ రైతుల్లో ఆశలు నింపుతున్నది. ఈ సంవత్సరం అధికవర్షాలతో పత్తి పంట ఆలస్యంగా చేతికి వస్తుండగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో పత్తి సేకరణ ప్రారంభమైనది. మరో రెండు విడతలుగా పత్తి సేకరణ కావాల్సి ఉండగా మొదటి సారి రైతులు సేకరించిన పత్తి మార్కెట్కు తరలిస్తున్నారు.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,16,814 ఎకరాల్లో పత్తిపంట సాగుచేయగా, మార్కెట్కు 99,292 మెట్రిక్ టన్నుల పత్తి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో అధిక ధర లభిస్తుండడంతో కేవలం గజ్వేల్ ప్రాంతానికి చెందిన రైతులే కాకుండా నర్సాపూర్, తూప్రాన్, శివ్వంపేట తదితర ప్రాంతాలతో పాటు వేర్వేరు జిల్లాల నుంచి రైతులు పత్తిని విక్రయించడానికి తీసుకు వస్తున్నారు.బుధవారం గజ్వేల్ మార్కెట్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో శివ్వంపేటకు చెందిన రైతు వినోద్ తీసుకువచ్చిన పత్తికి అత్యధికంగా క్వింటాల్కు వ్యాపారులు రూ.9,330 చెల్లించారు.
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు జిల్లాలోని 24 పత్తి మిల్లుల్లో 5529 మంది రైతులు ఇప్పటికే 38,707 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా సంబంధిత డబ్బులను వ్యాపారులు ఆన్లైన్లో వారి ఖాతాల్లో జమచేశారు. పత్తి మిల్లుల కంటే గజ్వేల్ మార్కెట్యార్డులోనే ఎక్కువ ధర వస్తుండడంతో రైతులు ఇక్కడ విక్రయించడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో ఈనామ్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్ చేస్తూ వ్యాపారులు పత్తి కొనుగోళ్ల కోసం పోటీపడడంతో రైతులకు మంచి ధర లభిస్తున్నది.
గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలో..
గజ్వేల్ మార్కెట్ యార్డులో బుధవారం క్వింటాల్ పత్తికి అత్యధికంగా ధర రూ.9930 పలుకగా అత్యల్పంగా క్వింటాల్ పత్తికి రూ.9,225 పలికింది. ఇప్పటి వరకు 140 మంది రైతుల నుంచి 303 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, రూ.26,48,185 డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలోని ఆరు పత్తి మిల్లుల్లో మంగళవారం రాత్రి వరకు 109 మంది రైతుల నుంచి 361 క్వింటాళ్ల పత్తి, మొత్తంగా 6210 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు.
మార్కెట్యార్డులోనే మద్దతు ధర
తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ యార్డుల్లో ఈనామ్ ద్వారా క్రయవిక్రయాలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. గజ్వేల్ మార్కెట్యార్డులో పత్తి విక్రయాలతో రైతులు అధిక ధర పొందే అవకాశం ఉన్నది. మార్కెట్ యార్డులో ఈనామ్ ద్వారా క్రయవిక్రయాలు నిర్వహించడంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు తీసుకొచ్చిన పత్తికి అధిక ధర పలుకుతున్నది. దళారుల చేతుల్లో మోసపోకుండా మార్కెట్ యార్డుల్లోనే రైతులు తమ పంటలు అమ్ముకోవాలి. నేటి నుంచి సద్దిమూట కార్యక్రమం ద్వారా రైతులకు రూ.5లకే భోజనాన్ని అందిస్తాం.
– మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్
నాణ్యతను బట్టి పత్తి నుగోలు చేస్తాం
రైతుల దగ్గరి నుంచి నాణ్యతను బట్టి పత్తి కొనుగోలు చేస్తాం. మేలురకం పత్తికి మంచి ధర పలుకుతున్నది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని నిజామాబాద్, బైంసాల్లోని పరిశ్రమలకు విక్రయిస్తా. కొందరు వ్యాపారులు గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలకు కూడా పత్తిని విక్రయిస్తుంటారు. ఎక్కడ విక్రయించినా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిందే. రైతులు నాణ్యమైన పత్తిని పండిస్తే మంచి ధర పొందవచ్చు.
– గంగులు, పత్తి వ్యాపారి
అన్ని వసతులు కల్పించాం
గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి, మక్క లు ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్ బిడ్డింగ్ కోసం వ్యాపారులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశాం. ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా పత్తిని విక్రయించిన రైతుకు తూకంలో ఎలాంటి మోసాలు జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాం. రోజురోజుకూ పత్తి కొనుగోళ్లు పెరుగుతుండడంతో పాటు రైతులకు మంచి ధర లభిస్తున్నది.
– జాన్వెస్లీ, గజ్వేల్ ఏఎంసీ కార్యదర్శి
పత్తి క్వింటాల్కు రూ.9328
గజ్వేల్ మార్కెట్ యార్డుకు మొదటిసారి పత్తి తీసుకొచ్చా. క్వింటాల్కు రూ.9328 ధర పలికింది. గతేడాది కం టే చాలా బాగా ధర వస్తున్నది. ఇంకా చాలా పత్తి వచ్చేది ఉన్నది. నా పొలంలో రెండుసార్లు పత్తి సేకరించేం దుకు వీలున్నది. మార్కెట్లో పత్తి ధర రోజురోజుకు పెరుగుతున్నది. మరింత మంచి ధర వచ్చేటట్లు అనిపిస్తున్నది. ఎక్కువ వాన పడి పత్తి దిగుబడి లేటవుతున్నది. కానీ ధర మంచిగ ఉన్నది. రైతులకు మస్తు లాభమే.
– వెంకటేశం, రైతు, కోనాపూర్
గజ్వేల్లో ఎక్కువ ధర వస్తుందని వచ్చాం
గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తికి ఎక్కు వ ధర వస్తున్నదని తెలిసింది. అందుకే శివ్వంపేట నుంచి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చాం. మూడేండ్ల తర్వాత ఈసారి పత్తి పంట సాగుచేశాం. ఎకరంన్నరలో పత్తి పంట సాగు చేస్తే బాగా పండింది. ఇప్పుడే మొదటిసారి పత్తి తీస్తే 2.20 క్వింటాళ్లు అయ్యింది. క్వింటల్కు రూ.9330 ధర పలికింది. పత్తి మంచిగుంటే మంచి ధర వస్తున్నది. మళ్లీ ఇక్కడికే మిగితా పత్తిని తీసుకొస్తా.