కొల్చారం, అక్టోబర్ 15 : పల్లెసీమలు దేశానికి పట్టుకొమ్మలు.. గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్న మహనీయుల మాటలను అమలు చేయడంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నది. ఈ-గ్రామ్స్వరాజ్ కూడా అందులో ఒక భాగమే. గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పాలనా సేవలు మరింత సులభంగా పొందడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-గ్రామ్ స్వరాజ్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో పాలకవర్గాలు చేపట్టిన అభివృద్ధి పనులు, అందుకు చేసిన వ్యయాల వివరాలు స్మార్ట్ఫోన్ల ద్వారా సులభంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీంతో గ్రామ పంచాయతీ ల్లో జరుగుతున్న పనులు, అందుకు అవుతున్న ఖర్చుల వివరాలు క్షణాల్లో ఈయాప్తో ప్రజలకు తెలిసిపోతాయి. నిధుల దుర్వినియోగం అరికట్టబడి మరిం త పారదర్శకంగా పాలన సాగుతుంది.
ఎందుకు ప్రాధాన్యత..
చాలా చోట్ల పంచాయతీ పాలకవర్గాలు చేస్తున్న నిధుల వ్యయాలు తెలుసుకోవడానికి ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటున్నారు. అడిగిన సమాచారం తెలుసుకోవడానికి అధికారుల నుంచి కొంత సమయం పడుతుంది. కొన్నేండ్లుగా వివరాలు ఇవ్వని పక్షంలో ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. సమాచారం పొందిన క్రమంలో అందుకయ్యే వ్యయాన్ని ప్రజలు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మన అరచేతిలో అర క్షణంలో ఏ గ్రామ పంచాయతీ వివరాలు కావాలనుకుంటే ఆ వివరాలు నిధులు, వ్యయాలు అన్ని ఈ గ్రామ స్వరాజ్ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
డౌన్లోడ్ ఎలా..
ఈ గ్రామ స్వరాజ్ యాప్ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లో గూగూల్ ప్లేస్టోర్లోకి వెళ్లి సెర్చ్లో ఈ గ్రామ స్వరాజ్ అని టైపు చేయాలి. ఈ యాప్నకు సంబంధించిన ఐకాన్ వస్తుంది. దాని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయినట్టే. యాప్ను ఓపెన్ చేస్తే రాష్ట్రం తర్వాత జిల్లా, మండల పరిషత్, దాని పరిధిలో కావాల్సిన గ్రామ పంచాయతీ పేరు వరుస క్రమంలో అడుగుతుంది. వాటిని పూరించి సబ్మిట్ చేయాలి. ఈఆర్ డిటెయిల్స్, అప్రూవ్డ్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ వీటిల్లో కావాల్సిన విభాగంపై క్లిక్ చేయగానే ఆ వివరాలు వస్తాయి.
యాప్లో ఉంటే అంశాలు
గ్రామ పంచాయతీలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు వాటి వ్యయం
పంచాయతీల పాలకవర్గాలు, వారి వివరాలు.
అభివృద్ధి కోసం పాలకవర్గాలు చేపట్టిన వివిధ పనులు, ఇందుకు అయిన వ్యయాలు యాప్లో పొందుపర్చబడి ఉంటాయి.
పంచాయతీ నిర్వాహకులు, పారిశుధ్య కార్మికుల జీతభత్యాల వివరాలు, పాలనాకమిటీ వివరాలు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి.
ప్రజలకు క్షణాల్లో వివరాలు..
2019లో ఈ-స్వరాజ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్తో ప్రజలు తమ గ్రామాల్లో పాలనాపరమైన అభివృద్ధి పనుల వివరాలు స్మార్ట్ఫోన్ ద్వారా క్షణాల్లో తెలుసుకోవచ్చు. యాప్పై ప్రజలకు సరియైన అవగాహన కల్పించాల్సి ఉంది.
– కె.ప్రవీణ్కుమార్, ఎంపీడీవో, కొల్చారం