పాపన్నపేట, ఫిబ్రవరి 19: ఏడుపాయల జాతర ఖ్యాతి నలుదిక్కులు వ్యాపించేలా అధికారులు చర్యలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. శనివారం జాతర ఏర్పాట్లపై హరితా రెస్టారెంట్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజులు జరుగనున్న ఈ జాతరకు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఈయేడు జాతర కోసం రూ.కోటి మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో శాశ్వత పనులు చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు 0.045 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ కోసం ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలన్నారు. జాతర సందర్భంగా వివిధ జిల్లాల నుంచి 120 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జాతరలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలుగకుండా ఉచిత బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.
వంద మంది గజ ఈతగాళ్లు
మంజీర నది పరివాహక ప్రాంతంతో పాటు ఘనపూర్ ఆనకట్టలో చెక్డ్యామ్ వద్ద స్నానాలు చేసే సమయంలో భక్తులు ప్రమాదాల భారిన పడకుండా చూసేందుకు వందమంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి ముందుగానే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోలీసుల భారీ బందోబస్తు
జాతరకు సుమారు 15లక్షల వరకు భక్తులు హాజరుకానున్నందున 1200 మంది పోలీసులతో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. 8మంది డీఎస్పీలు, 32 మంది సీఐలు, 39 మంది ఎస్ఐలు, 112 మంది ఏఎస్ఐలు, 134 మంది మహిళా కానిస్టేబుళ్లు, 306 మంది కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందితో బందోబస్తు చర్యలు తీసుకుంటామన్నారు. 34 సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం నిఘా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, ఎంపీపీ చందన, సర్పంచ్ సంజీవరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ, దేవాలయ ధర్మాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణకుమార్, అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు, ఆర్డీవో సాయిరామ్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, డీఎల్పీవో శంకర్నాయక్, నీటిపారుదల శాఖ ఎస్ఈ కనకరత్నం, పీఆర్ డిప్యూటీ ఈఈ పాండురంగారెడ్డి, ఆబ్కారీ శాఖ జిల్లా అధికారి రజాక్, డీఎస్పీ సైదులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగరావు, ఆలయ ఈవో సార శ్రీనివాస్, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.