అల్లాదుర్గం, సెప్టెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశ వ్యాప్తంగా జరగాలంటే అది కేవలం కేసీఆర్తోనే సాధ్యమని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రెడ్డిపల్లిలో బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రపద్రేశ్లో పాలించిన పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని ఆంధ్రాలో ఖర్చు చేశారని, దీంతో తెలంగాణ ప్రాంత అభివృద్ధి పూర్తిగా వెనుకపడిందన్నారు.
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇప్పుడు దేశంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే సీఎం కేసీఆర్ సేవలు అవసరమన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం 1200 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసిందని, ఇప్పటి వరకు లక్షా 38 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, 87వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిందని తెలిపారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్పై తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదన్నారు.
టీఆర్ఎస్లో చేరిన రెడ్డిపల్లి ఉప సర్పంచ్..
మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ కర్మోల్లా ప్రభాకర్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉప సర్పంచ్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉప సర్పంచ్తో పాటు 30 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమం లో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింలు, ఎంపీటీసీలు సుజాత, దశరథ్, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, తహసీల్దార్ తులసీరాం, సర్పంచులు అంజియాదవ్, మల్లేశం, నాయకులు సాయికుమార్, పవన్, మోహన్రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.