రైతులకు ఎరువులు, కరెంట్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో మెదక్ జిల్లాలో వరితో పాటు ఇతర పంటల సాగు గణనీయంగా పెరిగిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం జడ్పీ చైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పామాయిల్కు వరి కంటే డబుల్ ధర వస్తుందని ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని, యాసంగిలో విత్తన సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులకు సూచించారు. జిల్లాలో లక్షా 60వేల కుటుంబాలుంటే లక్షా 20 వేల ఆసరా పింఛన్లు వస్తున్నాయన్నారు. త్వరలో జిల్లాకు మెడికల్ కాలేజీ రాబోతున్నదని, 400 పడకలతో దవాఖానను నిర్మిస్తున్నట్లు వివరించారు. బీసీ మహిళా డిగ్రీ కళాశాల సైతం మంజూరు చేసినట్లు తెలిపారు. ‘మన ఊరు-మనబడి’ పనులు వేగవంతం చేయాలన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 22 : అత్యధిక పంటలు సాగు చేసే రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో పంట సాగు పెరిగింది. పంట సాగుకు బీహార్, బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ నుంచి కూలీలు వచ్చి ఉపాధి పొందుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా సాధారణ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతా శేఖర్గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వరి పంటతో పాటు ఇతర పంటల సాగు పెరిగిందన్నారు.
2021లో మెదక్ జిల్లాలో 5లక్షల 50వేల మెట్రిక్ టన్నులకు పైగా వరి పంట పండిందన్నారు. కోటి 35లక్షల ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగు చేశారు. ముఖ్యంగా రైతులకు ఎరువుల కొరత, కరెంట్ కొరత రాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ముఖ్యంగా వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారుల సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్య వచ్చిన ఆయా శాఖల అధికారుల ఎంతో నిబద్ధతతో సేవలు చేశారన్నారు. కేంద్ర ప్రభు త్వ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని, నూకలపై సైతం నిషేధం పెట్టిందన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ర్టానికి వచ్చే రూ. 30వేల కోట్ల నిధులు ఆపేసిందన్నారు. బోరు బావులకు మీటర్లు పెడితే నిధులు ఇస్తా మంటున్నారు.
విద్యుత్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం గెజిట్ విడుదల చేసిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రైతులు పామాయిల్ సాగు చేసే విధంగా వ్యవసాయధికారులు చర్యలు తీసుకోవాలని, పామాయిల్ కు వరి పంట కంటే డబుల్ ధర వస్తుందని తెలిపారు. యాసంగిలో విత్తన సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని మంత్రి వ్యవసాయధికారులకు సూచించారు. వాన కాలపు పంట కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మెదక్లో రేక్ పాయింట్ వచ్చిన తరువాత ఎరువుల స్టోరేజ్ ఎలా ఉందని జిల్లా వ్యవసాయధికారి ఆశారాణి అడిగారు. ఎరువుల కొరత రాకుండా స్టాక్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఉపాధి హామీ నిధులు జిల్లాకు రూ. 10కోట్లు విడుదల చేయడం జరిగిందని, అవే కాకుండా పాపన్నపేట మండలానికి రూర్బన్ నిధులు సైతం విడుదలయ్యాయని మంత్రి వివరించారు. ఈ రోజు సమావేశంలో ఎన్నో సమస్యలు చర్చించిన కరెంట్, తాగునీటిపై చర్చనే రాలేదని, ఎంతో మార్పు వచ్చిందో గమనించాలని మంత్రి పేర్కొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు ప్రభుత్వం అందజేస్తున్న మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లాలో రూ. లక్ష 60 వేల కుటుంబాలు ఉంటే లక్ష 20వేల పింఛన్లు ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. ప్రతి అర్హుడికి పింఛన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. పింఛన్ రాని అర్హుల జాబితా తయారు చేయాలన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల జాబితా సిద్ధం చేయాలని డీఆర్డీవో శ్రీనివాస్ను మంత్రి ఆదేశించారు.
మనఊరు-మనబడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని డీఈవోను మంత్రి ఆదేశించా రు. జిల్లాలో మొదటి విడుతలో 313పాఠశాలలను ఎంపిక చేసి రూ. 134కోట్లు మంజూరు చే సిందని ఎంత వరకు పనులు జరుగుతున్నాయని డీఈవోను అడిగారు. 209 పాఠశాలల్లో ప నులు ప్రారంభించిట్లు డీఈవో తెలిపారు. పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభించని పాఠశాలల్లో పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. ఈ పనులపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించి పనులు తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. పనులు పూర్తైన పాఠశాలల్లో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడం లేదని హవేళీ ఘనపూర్ ఎంపీపీ నారాయణరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తైతే డబ్బులు చెల్లించాలన్నారు.
చిలిపిచేడ్ మండల ప్రజాపరిషత్కు రూ. 5లక్షలు మంజురు చేస్తున్నట్లు మంత్రి హరీశ్రావు ప్రకటించారు. ఎంపీపీ కార్యాలయం అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉందని ఎంపీపీ మంత్రి దృష్టికి తేగా రూ. 5లక్షలు మంజూరు చేశారు. అలాగే నూతనంగా ఏర్పడిన మండలాలకు సైతం నిధులు మంజూరు చేస్తానన్నారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జడ్పీ సీఈవో వెంకట్శైలేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీటీసులు, ఆయా మండలాల ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం మెదక్తో పాటు నియోజకవర్గాల కేంద్రాలను మెడికల్ హబ్గా మారుస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలోనే జిల్లాకు మెడికల్ కళాశాల రాబోతున్నదని, ఎంసీహెచ్ పక్కనే 400 పడకల దవాఖానను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. క్రిటికల్ కేర్కు రూ. 23కోట్లు మంజూరు చేశారన్నారు. జిల్లాకు బీసీ మహిళ డిగ్రీ కళాశాల సైతం మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో వెయ్యిమంది వైద్యులను రిక్రూట్ చేస్తున్నామని ఈ రిక్రూట్తో జిల్లాలో ఖాళీల స్థానంలో వైద్యులను భర్తీ చేస్తామన్నారు. ప్రతి పిహెచ్సీ మూడు నెలలకు కావాల్సి మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి చెప్పారు. పాము, కుక్క కాటుకు మందులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్వోకు సూచించారు.
జిల్లాకు 57 పల్లె దవాఖానలు, 11 బస్తీ దవాఖానలు మంజూరయ్యాయని వాటిని తొందరగా ప్రారంభించాలన్నారు. ఇటీవలె ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ల వద్ద బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన మంత్రి కలెక్టర్, డీఎంహెచ్వోలకు ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత నెలలో జిల్లాలో 1011 ప్రసవాలు జరుగగా 809 ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు పేర్కొనగా మంత్రి ఆయనను అభినందించారు. నిజాంపేట జడ్పీసీపీ విజయ్కుమార్ విజ్ఞప్తి మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పిహెచ్సీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని డీఎంహెచ్వోనును ఆదేశించారు.
ఇటీవలే కురిసిన భారీ వర్షాల వలన పత్తి, పెసర పంటలకు నష్టం జరిగిందని నష్టపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని రేగోడ్ జడ్పీటీసీ యాదగిరి మంత్రి దృష్టికి తెచ్చారు. పెద్ద శంకరంపేట దవాఖానలో వైద్యుడు అందుబాటులో ఉండకపోవడం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మంత్రి దృష్టికి తేగా దసరాలోగా వైద్యుడిని నియమిస్తామన్నారు. ఆసరా పింఛన్ల మంజూరులో అవకతవకలు జరిగాయని అనర్హులకు పింఛన్లు మంజూరయ్యాయని, దరఖాస్తుల ను అధికారులు సరిగా పరిశీలించలేదని పాపన్నపేట ఎంపీపీ అన్నారు. క్రిమి సంహారక మందుల వలన ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని ఆర్గానిక్ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కోల్చారం జడ్పీటీసీ మెఘమాల వ్యవసాయ ధికారులకు సూచించారు. అధికారుల సమావేశాలకు రావడం లేదని మనోహరా బాద్ ఎంపీపీ పురం నవనీత సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా గిరిజ నులకు 10శాతం రిజర్వేషన్, సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడంపై గౌరవ సభ్యులు తీర్మానాలు ప్రవేశపెట్టగా పలువురు గౌరవ సభ్యులు బలపరచడంతో సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 22: జడ్పీ కార్యాలయంపై అంతస్తులో నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి హరీశ్రావు జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డితో కలిసి గురువారం ప్రారం భించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, జడ్పీ సీఈవో వెంకట శైలేష్ పలువురు జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బందులకు కలిగేలా వేరే ప్రాంతాల కొనుగోలు కేంద్రాలకు పంపడం సరికాదని ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి అన్నారు. యాసంగిలో రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పెట్టారని మరోసారి అలా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోనె సంచుల విషయంలో సైతం ఇబ్బందులు పెడుతున్నరన్నారు.
– ఎమ్మెల్సీ సుభాశ్రెడ్డి
మిషన్ భగీరథ ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు, దవాఖానలకు, వైకుంఠధామాలకు నీళ్లు అందించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో బతుకమ్మ ఘాట్ల వద్ద విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు.
– ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి