వేసవి సెలవులు అయిపోవడంతో సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొదటిరోజు విద్యార్థులు ఉత్సాహంగా బడిబాట పట్టారు. చిలిపిచెడ్, మునిపల్లి, న్యాల్కల్, చేగుంటతో పాటు పలు మండలాల్లో ఉపాధ్యాయులు చిన్నారులకు పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు. నామమాత్రంగా తరగతులు జరుగగా, మధ్యాహ్న భోజనాన్ని కూడా అందించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు బ్యాగులు, నోట్ పుస్తకాలు, ప్యాడ్స్ ఇతర సామాగ్రిని అందజేశారు. విద్యాధికారులు తనిఖీలు నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో పర్యటిస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ బడుల్లో అందుతున్న సౌకర్యాలను వివరించి తమ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. పటాన్చెరు, నారాయణఖేడ్ మండలాల్లో ఫిట్నెస్, అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులను ఎంవీఐలు సీజ్ చేశారు.
పటాన్చెరు, జూన్ 13: పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో, బీరంగూడలో విద్యా సంస్థల్లోని బస్సుల ఫిట్నెస్పై ఎంవీఐ పటాన్చెరు శాఖ సోమవారం ప్రత్యేక తనిఖీ చేపట్టింది. ఈ తనిఖీలో తొమ్మిది బస్సులను మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రజామోహమ్మద్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్ లేకపోవడం, అనుమతులు లేకుండానే విద్యార్థులను తరలిస్తున్న తొమ్మిది బస్సులను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్, అనుమతుల విషయంలో రాజీ పడేది లేదన్నారు. అన్ని సక్రమంగా ఉంటేనే రోడ్డుపైకి రావాలని సూచించారు. విద్యార్థుల భద్రతకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఐ అనుష, సిబ్బంది పాల్గొన్నారు.
నారాయణఖేడ్, జూన్ 13: నారాయణఖేడ్లోని మూడు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు జహీరాబాద్ ఎంవీఐ జయప్రకాశ్రెడ్డి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు తనిఖీ చేశారు. కండీషన్ సక్రమంగా లేని మూడు బస్సులను సీజ్ చేశారు. డీటీసీ శివలింగయ్య ఆదేశాల మేరకు 10 రోజలు పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, ప్రైవేట్ పాఠశాలల బస్సులను పరిశీలించి కండీషన్ సక్రమంగా లేని వాటిని సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు.