సంగారెడ్డి అర్బన్, ఆగస్టు5: ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆదివారం నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 7వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొన సాగనున్నది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోనున్నారు. ఇందుకు ఇన్విజిలెటర్లకు సాయంగా శిక్షణ పొందిన కానిస్టేబుళ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ సమస్య తలెత్తితే ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు ప్రతి కేంద్రంలో టెక్నీషియన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు తీసుకురావద్దని, వస్తువులను భద్రపర్చేందుకు క్లాక్ రూం సదుపాయం కల్పించడం లేదని అధికారులు సూచిస్తున్నారు. అభ్యర్థులు తమ పాస్ ఫొటోను హాల్ టికెట్ కింది భాగంలో అతికించుకోవాలి. బ్లూ లేదా బ్లాక్ పెన్నుతో మాత్రమే పరీక్ష రాయాలి.
సంగారెడ్డి జిల్లాలో 10 పరీక్షా కేంద్రాలు సిద్ధంచేశారు. జిల్లాలో 5766 మంది అభ్యర్థులు ఎస్సై పరీక్ష రాయనున్నారు. పరీక్షల నోడల్ అధికారిగా జహీరాబాద్ డీఎస్పీ రఘును నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలు
గీతం ఇంజినీరింగ్ కళాశాల (రుద్రారం)లో రెండు పరీక్షా కేంద్రాలు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల (సుల్తాన్పూర్)లో రెండు, మిగిలిన వాటిలో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఎల్లంకి ఇంజినీరింగ్ కళాశాల (పటేల్గూడ), ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల (ఫసల్వాది), సెయింట్ అంథోని జూనియర్ కళాశాల (శాంతినగర్, సంగారెడ్డి), సెయింట్ అంథోనీస్ హైస్కూల్ (శాంతినగర్, సంగారెడ్డి), ఎల్లంకి డిగ్రీ కళాశాల (శాంతినగర్, సంగారెడ్డి), తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సంగారెడ్డి)లో మొత్తం పది కేంద్రాలు ఏర్పాటుచేశారు.
ఎస్సై పరీక్ష రాసే అభ్యర్థులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుం డా చర్యలు తీసుకుంటున్నాం. ప్ర తి సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదు. గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి. హాల్ టికెట్లో అన్ని వివరాలు సరి చూసుకుని అందులో ఉన్న సూచనలు తప్పనిసరిగా పాటించాలి. పరీక్షకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.
– రమణకుమార్, సంగారెడ్డి ఎస్పీ