జహీరాబాద్/కోహీర్, సెప్టెంబర్ 7 : మండలంలోని కవేలి జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో 720 క్వింటాళ్ల రేషన్ పట్టుబడింది. ఎస్సై సురేశ్ వివరాల ప్రకారం.. కవేలి 65వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజరాత్కు వెళ్తున్న నాలుగు లారీలను తనిఖీలు చేపట్టారు. ఇందులో 720క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉండడంతో లారీలను సీజ్ చేశారు. బియ్యం విలువ రూ.11లక్షల వరకు ఉంటుందని, నాలుగు లారీల యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 160 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. డీసీఎం, బొలేరో వాహనల్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు నారాయణఖేడ్ తహసీల్దార్ దశరథ్ సింగ్ ప్రభుత్వ డిగ్రీ కళశాల వద్ద వాహనాలను పట్టుకున్నారు. వాహనాలను సోదా చేయగా, డీసీఎంలో 120 క్వింటాళ్లు, బొలేరో వాహనంలో 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ మేరకు ఎస్సై వెంకట్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బియ్యాన్ని గోదాంకు తరలించి, వాహనాలకు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.