మెదక్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కఠోర దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయుడు భగీరథ మహర్షి అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. గురువారం కలెక్టరేట్లో బీసీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో కలిసి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆనాడు భగీరథుడు చేసిన ప్రయత్నాలవల్లే మనం ఇప్పుడు పవిత్ర గంగాజలంతో పునీతులమవుతున్నామన్నారు.
మన రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగాయని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని, నీటిని పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ విషయంపై ప్రజలలో చర్చ జరగాలని, వివిధ సంఘాలు, పిల్లల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. భగీరథుడి అకుంఠిత దీక్ష, పట్టుదలను మార్గదర్శకంగా తీసుకొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో సగర రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దత్తు సాగర్, జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ సాగర్, బీసీ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారాం, రవీందర్ సాగర్, సాయిలు, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, సహాయ బీసీ అభివృద్ధి అధికారి నాగరాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.