రామాయంపేట/ చిన్నశంకరంపేట/ పాపన్నపేట, ఫిబ్రవరి 2 : వరి పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని లేకుంటే, సూక్ష్మ పోషకాలు అధికమై పంటను నాశనం చేస్తాయని రామాయంపేట వ్యవసాయశాఖ అధికారి రాజ్నారాయణ పేర్కొన్నారు. గురువారం రామాయంపేట మున్సిపాలిటీలోని కోమటిపల్లి, గొల్పర్తి గ్రామాల్లో వరి పంటలను పరిశీలించి, రైతులకు పలు సూచనలు సలహాలిచ్చారు. వరిలో పురుగు నాశనం కావాలంటే రాత్రిపూట సోలార్ లేదా విద్యుత్ లైట్లను పొలం మధ్యలో అమర్చాలని సూచించారు. యాసంగిలో ఎక్కువ శాతం కాం డం తొలుచు పురుగుతోపాటు తల్లి పురుగులు అధికంగా వస్తాయన్నారు. కాండం తొలుచు పురుగు నివారణకు మందును పిచికారీ చేస్తే పోతుందని, కానీ, తల్లి పురుగు చావదని దీంతో వరి ఆకులను తినేసి ఎర్రగా మారుస్తుందన్నారు. ఆకులను తినకుండా తల్లి పురుగు నివార ణకు విద్యుత్ దీపాలను వెలిగించాలన్నారు. లేకుంటే ఎకరం పొలానికి కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ 8 కేజీలు, పిప్రోనిల్ 4కేజీలు, క్లోరాంతోనిప్రోల్ 4 కేజీలు గుళికలను చల్లి, తెగుళ్లను నివారణ చేయవచ్చని తెలిపారు.
చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రా మానికి చెందిన రైతు వెంకటేశం వరి పంటను మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రవీణ్ పరిశీలించి, మొగి పురుగు నివారణపై అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులను సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏవో లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ వరినాట్లు ముందుగా వేయడంతోపాటు వాతావరణ మార్పులతో మొగి పురుగు ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. మొగి పురుగు నివారణకు కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ 50, ఈసీ 400 గ్రా మందును 200 లీటర్లలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ప్రతి ఏటా భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఆయన వెంట ఏఈవో శ్యాంకుమార్ ఉన్నారు.
పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో వరి పంటపై కాండం తొలుచు పురుగు వ్యాప్తిస్తుందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి నాగా రం కృష్ణ సూచించారు. పాపన్నపేటలో వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరినాట్లు వేసిన 15 నుంచి 20 రోజుల లోపు కార్బోక్యూరాన్ త్రీజీ గుళికలు ఎకరాకు 10కిలోల చొప్పున చల్లాలని సూచించారు. 30 నుంచి 40 రోజుల వరి పంటకు కార్టాఫ్హైడ్రోక్లోరైడ్ పిచికారీ చేయాలని వివరించారు. గుళికలను ఇసుకలో మాత్రమే కలిపి చల్లాల్సి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో యూరియాతో కలిపి చల్లోద్దని సూచించారు. ఆయన వెంట ఏఈవోలు రజిత, అభిలాష్ ఉన్నారు.