మర్కూక్, మార్చి 23: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయజెండాను ఎగురవేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు.శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని రంగనాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. జీజేపీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు పదిహేడు గెలుస్తామన్నారు. దేశంలో బీజేపీకి ఈసారి 400 సీట్లు వస్తాయని, దేశం బాగుపడాలంటే, శాంతిభద్రతలు బాగుండాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. రాబోయే 50 రోజులు కార్యకర్తలు కష్టపడి తన గెలుపునకు కృషిచేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగం సత్తయ్య, ఎంపీటీసీ చైతన్యశంకర్రెడ్డి, అప్పాల మల్లేశం, కిశోర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.