మెదక్ జిల్లాకేంద్రం నుంచి కాచిగూడ వరకు నడుస్తున్న రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో మెదక్ రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయడంతో రోజురోజుకు ప్రయాణికులు పెరుగుతున్నారు. ఇందుకోసం స్టేషన్లో 20 మంది సిబ్బందిని నియమించారు. మెదక్ నుంచి తిరుపతి, కాశీ, పుట్టపర్తి, ఢిల్లీ, ముంబాయి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. 37 రోజుల్లో రూ.4.73 లక్షల ఆదాయం సమకూరింది.
మెదక్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా కేంద్రానికి రైలు రావడంతో రైల్వేస్టేషన్ సందడిగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నది. అంతేకాకుండా ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 23న మెదక్-అక్కన్నపేట రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ 17.2 కిలోమీటర్ల మార్గానికి రూ.210 కోట్లు వెచ్చించారు. దీంతో మెదక్ నుంచి కాచిగూడ వరకు ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ఇందుకు మెదక్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
మెదక్ స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు…
మెదక్ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఎక్కడికైనా రైలులో ప్రయాణించాలంటే రిజర్వేషన్ చేసుకోవచ్చు. మెదక్ నుంచి తిరుపతి, కాశీ, పుట్టపర్తి, ఢిల్లీ, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మెదక్ రైల్వే స్టేషన్లో టిక్కెట్లను రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రిజర్వేషన్ కౌంటర్ తెరిచి ఉంటుందని మెదక్ రైల్వే స్టేషన్ మాస్టర్ పద్మారావు తెలిపారు. గతంలో మెదక్ పట్టణంలోని స్థానిక తహసీల్ కార్యాలయంలో రైల్వేశాఖ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ రైల్వేలైన్ లేకపోవడంతో మూతపడింది.
మెదక్ స్టేషన్లో 20 మంది సిబ్బంది నియామకం..
నూతనంగా ఏర్పడిన మెదక్ రైల్వేస్టేషన్లో రైల్వే శాఖ ప్రయాణిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో 20 మంది సిబ్బందిని నియమించింది. ఇందులో ఇద్దరు స్టేషన్ మాస్టర్లు, ఇద్దరు పాయింట్ మెన్లు, ఒక కీ మెన్, ముగ్గురు గ్యాంగ్మెన్లు, ఇద్దరు టెలికాం ఆపరేటర్లు, ముగ్గురు సింగ్నల్ డిపార్ట్మెంట్స్, ముగ్గురు ఇతర అధికారులు, నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు.
37 రోజులు.. రూ.4.73 లక్షల ఆదాయం..
మెదక్-అక్కన్నపేట మీదుగా కాచిగూడకు ప్రారంభమైన ప్యాసింజర్ రైలులో మొదటిరోజు 150 మంది ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. దీంతో మెదక్ రైల్వేస్టేషన్లో రూ.6 వేల కలెక్షన్ వచ్చింది. రెండో రోజు 25 మంది ప్రయాణికులు టిక్కెట్లు తీసుకోగా రూ.725 వచ్చాయని స్టేషన్ మాస్టర్ తెలిపారు. 37 రోజుల్లో రూ.4.73 లక్షల ఆదాయం సమకూరింది. మెదక్ నుంచి కాచిగూడకు ప్రతిరోజూ ఉదయం 5.20 గంటలకు రైలు బయల్దేరుతుందని, అక్కడి నుంచి మహబూబ్నగర్ వరకు వెళ్తుంది. ఇలా రెండు ప్యాసింజర్ రైళ్లను మెదక్ రైల్వేస్టేషన్ నుంచి నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.