సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్7: సంగారెడ్డి జిల్లాలో మన ఊరు – మనబడి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మనఊరు – మనబడి పనుల పురోగతిపై విద్యా, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. డివిజన్ వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశలో 441 పాఠశాళల్లో మన ఊరు – మనబడి పనులు ప్రారంభించామన్నారు.
పలు డివిజన్లలో పనులు నత్తనడకన సాగుతుండడంపై అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపడితే అధికారులు పనులు చేయడంలో శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్టీవోలు అప్లోడ్ చేయాలని, టెండర్ ప్రక్రియ పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీ వో రాజేశ్, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
వెల్దుర్తి, డిసెంబర్7: మన ఊరు-మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ డీఈవో రమేశ్ సూచించారు. బుధవారం వెల్దుర్తిలోని ఎంపీడీవో కార్యాలయంలో మన ఊరు-మనబడికి ఎంపికైన హెచ్ఎంలు, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లతో పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో పనులు, నిర్వహణ, పూర్తి చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత, ప్రణాళికతో వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో మొదటి విడతలో 313 పాఠశాలలు ఎంపిక కాగా 260 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, పలు పాఠశాలల్లో వివిధ సమస్యలతో పనులు ప్రారంభం కాలేదని,ప్రారంభం కావాలన్నారు. అనంతరం కస్తూర్భా పాఠశాలను తనిఖీ చేశారు. భోజనం, కూరగాయలు, వంటసామగ్రిని పరిశీలించారు. తాగునీటి ప్లాంట్ మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్వోను ఆదేశించారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారి సుభాశ్, సీఎంవో సూర్యప్రకాశ్, ఎంఈవో యాదగిరి, నోడల్ అధికారి సాంబయ్య, పీఆర్ ఏఈ శ్రీనివాస్, హెచ్ఎంలు, ఎస్ఎంసీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.