వెల్దుర్తి, డిసెంబర్ 16: అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన పరిధిలోని మాసాయిపేటలో శుక్రవారం జరిగింది. చేగుంట ఎస్సై2 పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన రజక పాపని నర్సింలు(38)కు అప్పులు అధికం కావడంతో కొన్ని రోజుల నుంచి మానసిక ఆవేదనకు గురవుతున్నాడు.
అప్పులు ఇచ్చిన వారు ఇవ్వాలంటూ నర్సింలును అడగడంతో మనోవేదనకు గురై శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైపోచయ్య తెలిపారు.