మనోహరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లలోని చెత్త సేకరించి డంపింగ్ యార్డుల వద్ద సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటి వద్దే చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చేందు కు మనోహరాబాద్ మండలం దండుపల్లిలో ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టారు. సర్పంచ్ పంజా లక్ష్మీ ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించారు. దీంతో గ్రామంలోని కొన్ని ఇండ్ల వద్ద ఈ విధానాన్ని ప్రయోగించారు.
దీనికోసం పొడవైన, వెడల్పుగా ఉండే రెండు ప్లాస్టిక్ పైపులను ప్రయోగాత్మకంగా 15 ఇండ్ల వద్ద ఏర్పాటు చేయించారు. ఒక దానిలో ఇంట్లోంచి రోజూ సేకరించే తడి చెత్తను వేసి మూతపెట్టాలి. ఆ పైపు నిండిన తర్వాత వానపాములను అందులో వేస్తారు. అనంతరం రెండో పైపులో చెత్తను వేయాలి. మొదటి పైపులో నిల్వ ఉంచిన చెత్త 45 నుంచి 50 రోజుల్లో నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుతుంది. దీంతో అతి తక్కువ శ్రమతో సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చు. ఇలా తయారైన ఎరువు ఇండ్లల్లో నాటిన మొక్కలకు వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పైపులను పంచాయతీ కార్యదర్శి హేమలత, ఉప సర్పంచ్ మహేందర్గౌడ్, నాయకుడు పంజా భిక్షపతి ముదిరాజ్ తదితరులు బుధవారం పరిశీలించారు.