మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు లారీలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్ నుంచి సంగారెడ్డి వైపు లారీల్లో గోవులు, లేగ దూడలను అనుమానాస్పదంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో హిందూ సంఘాల నాయకులు అప్రమత్తమయ్యారు. హిందూ వాహిని, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ప్రతినిధులు కలిసి పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద వాహనాలను అడ్డగించారు.
వాహనాలను తనిఖీ చేయగా లారీల్లో పెద్ద సంఖ్యలో గోవులు, దూడలు గుజ్జుగా నింపి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలించి పరిశీలన చేపట్టారు. అనంతరం పశువులను రక్షించి బీరంగూడ గోశాలకు తరలించినట్లు తెలిసింది. మూడు వాహనాల్లో కలిపి వందకు పైగా గోవులు, లేగ దూడలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే పశువులను అమానుషంగా ఒకదానిపై ఒకటి నింపి తరలించడం వల్ల కొన్ని దూడలు ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం.