మెదక్ అర్బన్/ శివ్వంపేట/ చిలిపిచెడ్, జనవరి 24 : మహిళా సాధికారతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ పనిచేస్తున్నదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. మంగళవారం జాతీ య బాలికల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. మహిళలకు కోర్టులు అండగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. బాలికలను ప్రోత్సహి స్తే మరింత ఉన్నత స్థానాలకు ఎదుగుతారని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చేసే పనులు, సేవలు, భా ద్యతలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి జితేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫజల్ ఆహ్మద్, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలయ్య, న్యాయవాది కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
వేధింపులపై మౌనం వీడాలి : సీడీపీవో హేమభార్గవి
శివ్వంపేట మండల పరిధిలోని గూడూరు కస్తూర్బా బా లికల పాఠశాలలో బాలికల దినోత్సవం నిర్వహించారు. బా లికలు సమాజంలో ఎదుర్కొంటున్న వేధింపులపై మౌనం వీడాలని నర్సాపూర్ ప్రాజెక్టు సీడీపీవో హేమభార్గవి పిలుపు నిచ్చారు. కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీడీపీవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థినులు బాల్యవివాహాలను చేసుకోవద్దని, ఉన్నత చదువులు చదివి ప్రతిభను చాటాలన్నారు. అనంతరం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై విద్యార్థి నులు డ్రామా, డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు సంతోష, వసుమతి, హెచ్ఎం మంజూల, ఉపాధ్యాయులు ఉన్నారు.
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ కస్తూర్బా పాఠశాల లో బాలికల దినోత్సవం నిర్వహించారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని హెచ్ఎం ఉమమహేశ్వరి అన్నారు.