సిద్దిపేట, జూన్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలకు సేవలు అందించాల్సిన తహసీల్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నది. భూ రికార్డుల సవరణల నుంచి వారసత్వ మార్పులు, పాస్బుక్లు, సరిహద్దు వివాదాలు, సాదాబైనామాల పరిషారం వరకు ప్రతి పనికి ధర నిర్ణయించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందాల్సి ఉండగా, రెవెన్యూ అధికారులు అక్రమార్జనకు అలవాటు పడి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజల సంఖ్య పెరిగింది. భూరికార్డుల సవరణలు, వారసత్వ హకుల నమోదు, ఎన్వోసీలు, సర్వేలు వంటి పనుల కోసం కార్యాలయాలకు వెళ్తే ప్రజలు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పైరవీ లేదా పైసా ఉంటేనే పనులు జరుగుతున్నాయి.
అధికారులు-దళారుల కుమ్మకుతో ప్రజల నుంచి రూ.వేల నుంచి లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఉన్న దుద్దెడ శివారులోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా, కబ్జాలకు గురవుతున్నా, భూ మాఫియా అరాచకాలకు పాల్పడుతున్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు, కలెక్టర్ తక్షణమే ఈ భూ కబ్జాలపై విచారణ జరిపి సర్వే 745/3, 2020/6,173/ 4/1, 173/5 4/2,655, 657, ఆగ్రామ శివారులోని భూముల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను రక్షించాలని, భూములు కొని మోసపోయిన వ్యక్తులకు న్యాయం చేయాలని, భూమాఫియాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో భూమాఫియా చెరలో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి విచ్చలవిడిగా భూములు కబ్జా చేస్తున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దొంగ సర్వే నంబర్లు వేయడం …ఒక సర్వే నంబర్ మరో భూమి సర్వే నంబర్గా చూపి భూములను విక్రయిస్తూ కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు. గతంలో ప్రభుత్వం దళితులకు అసైన్డ్ చేసిన భూములు, గ్రామ కంఠం భూములు, సీలింగ్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్న భూములను బలహీన వర్గాలకు ఇచ్చిన పట్టా భూములను టార్గెట్ చేసి తహసీల్ కార్యాలయంలో సిబ్బంది, తహసీల్దార్ను మచ్చిక చేసుకొని రిజిస్ట్రేషన్లు మార్చి వెంట వెంటనే భూముల ను ఇతరులకు విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి పోర్టల్లోని లొసుగులను ఆసరా చేసుకొని, సాదాబైనామా నకిలీ కాగితాలు సృష్టించి ప్రభుత్వ భూములను సైతం విక్రయిస్తున్నారు. ఈ భూమాఫియాకు తహసీల్దార్లు, తహసీల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది లంచాలకు ఆశపడి విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు లంచాలకు మరిగి ఇష్టారీతిన భూ మాఫియాకు సహకరిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేసి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూ మాఫియాకు చెందిన వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి పకడ్బందీగా ఈవ్యవహారం నడిపిస్తున్నారు.
ప్రభుత్వ భూములను కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. భూములను కబ్జా చేసి చుట్టూ ప్రహరీ, తాతాలిక నిర్మాణాలు చేపట్టి ఇంటి నంబర్లు సైతం తీసుకున్నారు. ప్రస్తుతం భూభారతి పోర్టల్లోని లోపాలను ఆసరా చేసుకుని విచ్చలవిడిగా నకిలీ సాదాబైనామా పేపర్లు సృష్టించి విక్రయాలు చేస్తున్నారు. భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కొండపాక తహసీల్ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు ఈ అక్రమాలకు ఊతం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు న్యాయం చేయాలని భూ బాధితులు సిద్దిపేట కలెక్టరేట్లో వినితి పత్రం ఇచ్చారు.
సిద్దిపేట కలెక్టరేట్కు సమీపంలోనే రెవె న్యూ అధికారుల అండదండలతో భూకబ్జాలు సాగుతున్నాయి. కొండపాక మండలంలో కొంతమంది సిండికేట్గా ఏర్పడి ఈ భూ కబ్జాలు చేస్తున్నారు. దీనికి ఎంతో మంది అమాయకులు బలవుతున్నారు. ఒక ప్రాంత సర్వే నంబర్ను మరొక ప్రాంతంలో చూపి దుద్దెడ శివారులోని భూములను విక్రయించారు. దీంతో కోట్లాది రూపాయలు అర్జించారు. భూము లు కొనుగోలు చేసిన వ్యక్తులు కబ్జాకు వెళ్లే సమయానికి అసలు ఆ భూమి ఇది కాదని తెలియడంతో ఇవ్వాళ వారంతా గుండెలు బాదుకుంటున్నారు.
దుద్దెడ శివారులో నిర్మించిన కలెక్టరేట్ ప్రహరీ ఆనుకొని హైదరాబాద్ రోడ్డుకు కొద్ది దూరంలో ఉన్న సర్వే నెంబర్ 655 తమదేనని తప్పుడు రికార్డులు సృష్టించి ల్యాండ్ మాఫియా భూములను విక్రయిస్తున్నది. సర్వేనెంబర్ 657లో కూడా ఇదేవిధంగా తహసీల్ కార్యాలయంలో సిబ్బంది, అధికారులను మేనేజ్ చేసుకుని విక్రయాలు కొనసాగించారు. దుద్దెడ గ్రామ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెనుక వైపు ఉన్న సర్వే నెంబర్ 202 ఆ/6 లో 10 గుంటలు, దాని పకనే ఉన్న మరో 20 గుంటలు అసైన్డ్ భూమిని ప్లాట్లు చేసి విక్రయించారు. సిద్దిపేటకు చెందిన పలువురు ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు.
అకడికి వెళ్తే ఆ సర్వే నెంబర్ భూమి అకడ లేకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు లబోదిబోమంటున్న పరిస్థితి నెలకొన్నది. కష్టపడి సంపాదించిన డబ్బు భూ మాఫియా పాలు కావడంతో వారు తమ డబ్బుల కోసం విక్రయించిన వ్యక్తుల వద్దకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. దుద్దెడ శివారులోని సర్వేనెంబర్ 173/ఈ 4/1లో ఎకరం ఒక గుంట, 173/ఈ 4/2/1 సర్వే నెంబర్లలో ఎకరం 10 గుంటలు, అదే సర్వే నెంబర్లో 24 గంట లు ఆ స్థలాన్ని సేలంపుకు వెళ్లేదారిలో గరుడ వెంచర్ పకన ఉన్నట్లు భూమిని చూపి ఇటీవల ఓవ్యక్తికి విక్రయించినట్లు తెలిసింది. గతంలో ఆరెకటికల పేరిట, రజకుల పేరిట ఉన్న ఈ భూమిని రిజిస్ట్రేషన్ మార్చి విక్రయించినట్లు సమాచారం.