చేర్యాల, జనవరి 19 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమైంది. జనవరి 7న నిర్వహించిన కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణం, పట్నం వారం, లష్కర్వారం, మహా శివరాత్రి రోజున పెద్ద పట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగనున్నాయి.
ఈ నెల 22న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్ ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయవర్గాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ ఈవో ఎ.బాలాజీ, చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
పట్నం వారం హైదరాబాద్కు చెందిన భక్తులు కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్నపేరిట సట్టీ దీక్షలను 41 రోజులు నిర్వహించి, పట్నం వారం స్వామి వారిని దర్శించుకుని, దీక్షలు విరమించనున్నారు. అనంతరం గుట్ట పై ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించనున్నారు. పట్నం వారం సందర్భంగా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అదనపు డీసీపీ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ సత్యనారాయణరెడ్డి, కొమురవెల్లి ఎస్సై నాగరాజు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్యను మెదక్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి డిప్యుటేషన్ వేస్తూ దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ అనిల్కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యులు కొందరు ఏఈవోపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.