చేర్యాల, ఏప్రిల్ 21: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. మల్లన్నస్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. స్వామివారి ఉత్సవాలు ముగిసినప్పటికీ పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కొమురవెల్లి క్షేత్రానికి 16వేల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీశర్మ తెలిపారు.శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. కార్యక్రమాలలో మల్లన్న ఆలయ ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ధిశ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పట్నాలు వేస్తున్న భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఫిర్యాదులు రావడంతో ఆలయ ఈవో తీవ్రంగా స్పందించారు. ఒగ్గు పూజారుల సంఘం ప్రతినిధులను ఆయన కార్యాలయానికి పిలిపించి పట్నం వేసి భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని, వారం డబ్బులు వసూలు చేసిన ఒగ్గు పూజారిని నెలపాటు సస్పెండ్ చేశానని తెలిపారు. భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు మరో ఫిర్యాదు వస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని ఆలయ ఈవో వార్నింగ్ ఇచ్చారు.
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో సెల్ఫోన్లు భద్రపర్చేందుకు టెండరుదారుడు భక్తుల నుంచి సెల్పోన్లు లాక్కుంటున్నట్లు ఫిర్యాదు రావడంతో ఆలయ ఈవో టెండరుదారుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆలయ హోంగార్డులను పిలిచి సెల్ఫోన్ టెండరుదారుడి వద్ద ఉన్న సెల్పోన్లు చెకింగ్ వస్తువులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టెండరుదారులను పిలిచి ఎందుకు మొబైల్ ఫోన్లు లాక్కుంటున్నారని మందలించడంతో పాటు ఇదే పద్ధతి కొనసాగిస్తే టెండరు రద్దు చేస్తానని తెలిపారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామిక్షేత్రంలోని నిత్యాన్నదాన ప్రసాద వితరణశాలకు హైదరాబాద్ నగరంలోని యాప్రాల్కు చెందిన సాయిభవిక్రెడ్డి రూ.1,00,116 విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ఏఈవో శ్రీనివాస్ విరాళంగా తీసుకున్న డబ్బులకు రశీదు అందజేసి, దాతను మహారాజ పోషకుల స్కీంలో నమోదు చేశారు. కార్యక్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.