చేర్యాల, మార్చి 2 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలిరానున్నారు. వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ పూర్వపు జిల్లాల నుంచి భక్తులు రానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
దర్శనం కోసం వచ్చే భక్తులు మల్లన్నకు బోనం సమర్పించి పట్నం వేసి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మల్లన్న గుట్టపై ఎల్లమ్మకు బోనం చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మలను దర్శించుకోనున్నారు. మల్లన్న జాతర కోసం వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.