‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల శరణుఘోషతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఆదివారాన్ని పురస్కరించుకొని సుమారు 35వేల మంది వరకు తరలివచ్చారు. ఉదయం నుంచే మల్లన్న దర్శనం కోసం బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ‘కోరమీసాలసామి కోటి దండాలంటూ’ స్మరించుకొని తన్మయత్వం పొందారు. ప్రత్యేక పూజలు చేసి, పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి ఒడిబియ్యం సమర్పించారు. శివసత్తుల పూనకాలు,పోతరాజుల విన్యాసాలు అలరించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం భక్తజన సంద్రమైంది. మూడో ఆదివారం సందర్భంగా 35 వేల మంది భక్తులు తరలివచ్చారు. మల్లన్న దర్శనంతో మంత్ర ముగ్ధులయ్యారు. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం జనం క్యూ కట్టారు. గంగిరేగుచెట్టు వద్ద ముడుపులు కట్టి, పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం, మల్లన్నకు అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు. గుట్టపై ఉన్న ఎల్లమ్మకు మహిళా భక్తులు ఒడిబియ్యం పోసి బోనం సమర్పించారు.
చేర్యాల, ఫిబ్రవరి 5 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.మల్ల న్న దర్శనంతో భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు.3వ ఆదివారం స్వామి వారి నామస్మరణతో మల్లన్న క్షేత్రం మార్మోగింది. ఆదివారం సందర్భంగా 35వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆలయ నిర్వహణలో ఉన్న గదులు, ప్రైవేట్ గదులు అద్దెకు తీసుకుని అందులో బస చేస్తున్నారు.శనివారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి స్వామి వారి దర్శనం కోసం క్యూలో గంటల పాటు వేచి ఉన్నారు.స్వామి వారి దర్శనం అనంతరం గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కు లు తీర్చుకున్నారు.అంతేకాకుండా మరికొందరు గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం, మల్లన్నకు అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించడంతో పాటు గుట్ట పై ఉన్న ఎల్లమ్మకు ఒడి బియ్యం పోసి బోనం సమర్పించుకున్నారు. ఈ సందర్బంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈవో ఎ.బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, పర్యవేక్షకులు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, ఆలయ ప్రధానార్చకుడు మహదేవుడి మల్లికార్జున్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వరల్యంలో ఎస్సైలు చంద్రమోహన్, నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
‘మల్లన్న’ను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ పద్మారావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్కు ఆలయ చైర్మన్, ఈవో బాలాజీ, పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వారి వెంట ఆలయ పాలక మండలి మాజీ డైరెక్టర్ ముత్యం నర్సింహులుగౌడ్ ఉన్నారు.
పోలీసుల విస్తృత బందోబస్తు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి మూడో ఆదివారం సందర్భంగా మల్లన్న క్షేత్రంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో పోలీసుల విస్తృత బందోబస్తు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ స్వామి వారి క్షేత్రంలోని పార్కింగ్ ప్రదేశాలు, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలతో పాటు టెంపుల్ ఆవరణను పరిశీలించి అధికారులు, సిబ్బందికి కమ్యూనికేషన్స్ సెట్ ద్వారా బందోబస్తు పర్యవేక్షణ చేస్తూ సూచనలు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ పట్నం వారం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సీసీ కెమెరాల ద్వారా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని, భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్లో తెలుపాలన్నారు. ఆయన వెంట హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్,హుస్నాబాద్ సీఐ కిరణ్, కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్, కోహెడ ఎస్సై నరేందర్రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
మల్లన్న సన్నిధిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు.స్వామి వారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీకి ఆలయ చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో ఆలయవర్గాలు ఘన స్వాగతం పలికాయి. స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ గెస్ట్హౌస్లో ఆలయ ఈవో, చైర్మన్ మల్లన్న ఆలయ అభివృద్ధి, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, స్వామి వారి ఆలయంలో భక్తుల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎమ్మెల్సీకి వివరించారు.సీఎం కేసీఆర్ ఆలయానికి కేటాయించిన 131 ఎకరాల వివరాలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మల్లన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ప్లాన్ రూపొందించి దానికి అనుగుణంగా పనులు చేపడితే భక్తులకు ఎంతో వసతి చేకూరుతుందన్నారు. తనవంతుగా మల్లన్న ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని, ఆలయ అధికారులు, పాలక మండలి ప్రతిపాదనలు తయారు చేస్తే నిధులు మంజూరు చేయిస్తానన్నారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఈవో, పాలక మండలి ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో జడ్పీటీసీ శెట్టె మల్లేశం, ఎంపీపీ తలారీ కీర్తనాకిషన్,ఆలయ డైరెక్టర్లు సూటిపల్లి బుచ్చిరెడ్డి, కందుకూరి సిద్ధిలింగం, పచ్చిమడ్ల సిద్ధిరాములు, కాసర్ల కనకరాజు, చెట్కూరి తిరుపతి, సర్పంచ్ సార్ల లతాకిష్టయ్య, మాజీ డైరెక్టర్ ముత్యం నర్సింహులుగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు బుడిగే రమేశ్గౌడ్ పాల్గొన్నారు.