మెదక్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): డెలివరీ అయిన వెంటనే కేసీఆర్ కిట్ అందజేసి రిజిస్టర్లో వివరాలు నమో దు చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం స్థానిక మాతాశిశు ఆరోగ్య కేం ద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ఆకస్మిక తని ఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో అన్నిరకాల వైద్య సేవలు అం దుబాటులో ఉన్నాయని, సేవలు వినియోగించుకునేలా ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు కృషి చేయాలని, సాధారణ కాన్పులపై అవగాహన కల్పించాలన్నారు. ఓ గర్భిణితో మాట్లాడుతూ మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలతో పాటు కేసీఆర్ కిట్టు అందిస్తున్నారని, సమయానుకూలంగా శిశువులకు టీకాలు ఇప్పించాలని, గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
ప్రతి విభాగం వినియోగంలో ఉండాలి..
దవాఖానలోని ప్రతి విభాగం వినియోగంలో ఉండాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మెదక్ వైద్యారోగ్య శాఖాధికారి డా.చందూనాయక్, జిల్లా దవాఖాన సూపరింటిండెంట్ డా.చంద్రశేఖర్, కార్యనిర్వాహక ఇంజినీర్ రవీందర్రెడ్డితో కలిసి దవాఖానలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా అవసరమైన సిబ్బందిని మీకున్న ప్రొవిజన్ మేరకు నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్లో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సిబ్బంది సమయ వేళలు కచ్చితంగా పాటించాలని, బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలన్నారు.ప్రతి శుక్రవారం, ఆదివారం మాత్రమే స్కానింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెగ్యులర్గా రేడియాలజిస్ట్ ఉండేలా చూడాలన్నారు. గైనకాలజిస్ట్ కూడా స్కానింగ్పై అవగాహన కలిగి ఉండాలని, స్కానింగ్ తీసిన వెంటనే రోగికి రిపోర్ట్ అందజేయాలని సూచించారు.
కేసీఆర్ కిట్ బఫర్ స్టాక్ ఉంచుకోవాలని, టీకా మందులు కూలింగ్ ప్లేస్లో భద్రపర్చాలని సూచించారు. ఓపీ సేవలను మెరుగుపర్చి ప్రతిరోజు ఎక్కువ మందికి సేవలు అందించేలా చూడాలని వైద్యాధికారుకు సూచించారు. దవాఖానకు వచ్చే రోగులు, సహాయకులు కూర్చునేందుకు వీలుగా లాన్లో కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, మూడు లక్షలు విలువ గల ఫర్నిచర్ ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చినందున వెంటనే ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. దవాఖానలో అవసరమైన ఆక్సిజన్ నిలువలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఎక్స్రే, ఫీడింగ్ సెంటర్ వంటి కొన్ని విభాగాలు మూసి ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంతో సునిశితమైన ప్రసూతి వార్డులకు డాక్టర్లు రౌండ్స్కు వచ్చినప్పుడు మాత్రమే సందర్శకులను అనుమతించాలని సూచించారు. దవాఖానలో పెండింగు పనులు ఉన్నాయా, తూప్రాన్ రక్తనిధి భవనం ఆధునీకరణ, మెదక్లో రేడియాలజీ భవన నిర్మాణ పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, తహసీల్దార్ శ్రీనివాస్, డా.శివదయాల్ తదితరులు పాల్గొన్నారు.