నారాయణఖేడ్, సెప్టెంబర్ 4: దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన వేళ.. సీఎం కేసీఆర్ హామీ సాకారమైన తరుణం.. ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి తన మాట నిలబెట్టుకున్న సమయం.. వెరసి తడ్కల్ మండలం ఏర్పాటు. కంగ్టి మండలంలోని 16 గ్రామ పంచాయతీలతో కలిపి తడ్కల్ మండలాన్ని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మండలం ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆదివారం ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో తడ్కల్తో పాటు పరిసర గ్రామాల ప్రజల ఆనందానికి అవధుల్లేవు. అప్పటికప్పుడు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి స్థానికులు సంబురాలు చేసుకుని, మిఠాయిలు పంచుకున్నారు.
ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మండలాలు ఏర్పాటు కాగా అప్పటి నుంచి తడ్కల్ ప్రాంత ప్రజలు మండలం కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలోనూ ఈ అంశం ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా పెడచెవిన పెట్టిందనే విమర్శ ఉంది. స్థానికుల కోరికను గౌరవిస్తూ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి 2019 నుంచి పలు దఫాలుగా ప్రభుత్వానికి నివేదించిన మేరకు, సీఎం కేసీఆర్ సూచన మేరకు 16 పంచాయతీలతో కూడిన మండలాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేశారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నారాయణఖేడ్కు వచ్చిన సందర్భం గా తడ్కల్ మండలం ఏర్పాటు చేసే విషయమై హామీ ఇచ్చారు. తడ్కల్ మండలం ఏర్పాటు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ సాకారం కావడంతోపాటు ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట నిలబెట్టుకున్నట్లు అయ్యింది. ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించడం, సత్వర పరిష్కారాల కోసం అధికార వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం సిర్గాపూర్, నాగల్గిద్ద, నిజాంపేట్ కేంద్రాలుగా మూడు మండలాలను ఏర్పాటు చేసింది. తాజాగా తడ్కల్ కేంద్రంగా మరో మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది మండలాలు కానున్నాయి.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
తడ్కల్ మండలం ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. తడ్కల్ ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు తాను, సీఎం కేసీఆర్కు లిఖితపూర్వకంగా విన్నవించానని, ఫలితంగా తడ్కల్ మండలం ఏర్పాటు కావడం తనకెంతో ఆనందంగా ఉన్నదన్నారు. తడ్కల్ మండల ఏర్పాటుపై విపక్షాలన్నీ ఏకమై ఓట్ల రాజకీయం చేశాయని, వారికి చిత్తశుద్ధి ఉంటే వారి ప్రభు త్వ హయాంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాదు దాన్ని నెరవేర్చే బాధ్యత కూడా తీసుకున్నదనే విషయం తడ్కల్ మండలం విషయంలో రుజువైందన్నారు.