దౌల్తాబాద్, మే 13: అప్పుకింద అర్ధరాత్రి దొంగచాటుగా పంటను కోసుకుపోయిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన దళిత రైతు ఎల్లయ్య తన భూమిలో సాగుచేసిన వరి పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి కోసుకుపోయాడు. బుధవారం బాధిత కుటుంబాన్ని దళిత బహుజన ఫ్రంట్ నిజనిర్ధారణ బృందం కలిసి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన పొట్టోళ్ల ఎల్లం కుటుంబానికి చెందిన 1.20 ఎకరాల భూమిలో వేసుకున్న వరి పంటను అప్పు కింద పాతూరి నర్సింహారెడ్డి అనే వ్యక్తి అర్ధరాత్రి కోసుకుపోయాడని తెలిపారు.
ఎల్లం కొన్నేండ్లుగా నరసింహారెడ్డి దగ్గర జీతం ఉండి, కొంత డబ్బును అప్పు తీసుకున్నాడని తెలిపారు. రూ.2లక్షల నుంచి అప్పునకు మిత్తిమీద మిత్తి పెంచి రూ.11 లక్షల అప్పు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని, అక్రమంగా అతని అసైన్డ్ భూమిని కుదువ పెట్టుకొని అన్యాక్రాంతానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ అన్యాయంపై బాధిత కుటుంబం న్యాయస్థానానికి వెళ్లగా, ఈ అసైన్డ్ భూమి దళిత కుటుంబానికే చెందుతుందని న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం సైతం పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసిందన్నారు.
2025 నుంచి ఎల్లం కుటుంబం ఆ భూమిలో పంటలు సాగుచేస్తున్నదని తెలిపారు. ఇటీవల రాత్రి దొంగలాగా వచ్చి ఎల్లం పంటను కోసుకు పోయిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం దౌల్తాబాద్ ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎస్సీ,ఎస్టీ లైంగికదాడి నిరోధక చట్టం, బీఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని శంకర్ డిమాండ్ చేశారు. దళిత రైతులకు అన్ని విధాలుగా అధికారులు న్యాయం చేయాలని శంకర్ కోరారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా కార్యదర్శి వేణు పాల్గొన్నారు.