ఎటుచూసినా పచ్చని బైళ్లు.. చుట్టూ ఆహ్లాదకర వాతావరణం.. జనారణ్యానికి దూరంగా ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న జలపాతం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండాకోనల మధ్య గలగల పారుతున్న జలాలు సందర్శకుల మనస్సును దోచుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడిమాల్కాపూర్, సజారావుపేట తండా సమీపంలో కర్ణాటక సరిహద్దు సంగాపూర్ తండా వద్ద ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.
జలపాతం కనువిందు
జహీరాబాద్, జూలై 15 : నల్లటి రాళ్లతో కూడిన గుట్టలు.. ఆ రాళ్ల మధ్యన గలగల పారుతున్న జలాలు.. కోకిల రాగాలు.. పచ్చిక బయళ్లు.. ప్రకృతి అందాల మధ్య కనువిందు చేస్తున్నది జాడిమాల్కాపూర్ జలపాతం. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాడిమాల్కాపూర్, సజారావుపేట తండా సమీపంలో కర్ణాటక సరిహద్దులో సంగాపూర్ తండా సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇటీవల కురిసిన వానలకు ఈ జలపాతం పారుతూ ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతున్నది. ఈ జలపాతం నుంచి పారుతున్న జలాలు కర్ణాటకలోని చంద్రంపల్లి ప్రాజెక్టుకు వెళ్తున్నాయి. తెలంగాణ-కర్ణాటక సరిహద్దున జాడిమాల్కాపూర్, సజ్జారావుపేట తండాలు ఉంటాయి. కర్ణాటకలోని సంగాపూర్తండా తెలంగాణ సరిహద్దులో ఉంటుంది. అక్కడే ఈ జలపాతం ఉంది. ఈ జలపాతం, ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు జహీరాబాద్, తాండూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, హైదరాబాద్తో పాటు కర్ణాటకకు చెందిన ప్రజలు వస్తుంటారు.
జలపాతానికి ఇలా వెళ్లవచ్చు..
జాడిమాల్కాపూర్ జలపాతం జహీరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జహీరాబాద్ పట్టణ సమీపంలో మొగుడంపల్లి చౌరస్తా ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా గోవింద్పూర్ గ్రామానికి పోవాలి. గోవింద్పూర్ నుంచి పర్వతాపూర్ చౌరస్తా నుంచి విటునాయక్ తండాకు వెళ్లే రోడ్డులో పోవాలి. మిర్జాంపల్లి తండా రోడ్డు పక్కన నుంచి జాడిమాల్కాపూర్ జలపాతానికి రోడ్డు ఉంటుంది. ఆ చౌరస్తా వద్ద విటునాయక్తండా బోర్డుతో పాటు కర్ణాటకలోని సంగాపూర్ తండాకు వెళ్లి రోడ్డు మార్గం చూపే బోర్డు ఉంటుంది. కన్నడ భాషలో ఉన్న బోర్డు మార్గంలో వెళ్లాలి. మధ్యలో కర్ణాటకలోని సంగాపూర్ తండా వస్తుంది. అక్కడి నుంచి నేరుగా జలాపాతానికి చేరుకోవచ్చు. ఆటోలు, ప్రైవేటు వాహనాలు ఉండవు. సొంత వాహనాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
నారింజ ప్రాజెక్టుకు జలకళ..
సంగారెడ్డి జిల్లా నారింజ ప్రాజెక్టు వరదతో కళకళలాడుతున్నది. జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) గ్రామ శివారులో జహీరాబాద్-బీదర్ రోడ్డుపై ఉన్న నారింజ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకోవడంతో గురువారం రాత్రి నుంచి గేట్లపై నుంచి వరద కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నది. జహీరాబాద్ తహసీల్దార్ నాగేశ్వర్రావు ప్రాజెక్టును సందర్శించారు. నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారి జానకీరామ్కు జాగ్రత్తలపై ఆయన సూచనలు చేశారు.
జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) నారింజ ప్రాజెక్టు గేట్లపై నుంచి ప్రవహిస్తున్న వరద