రామాయంపేట, ఏప్రిల్ 15: ఉచిత ప్రయాణంతో ఏ ఊర్లో చూసినా, ఏ బస్టాండులో చూసినా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళలు ఏ పనికైనా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఆధార్కార్డు తీసుకుని బస్టాండు బాట పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం వర్కింగ్ డే కావడంతో రామాయంపేట బస్టాండు కిటకిటలాడింది. అప్పుడే మెదక్ బస్సు రాగానే వందల సంఖ్యలో మహిళలు చేరుకుని నువ్వా నేనా అంటూ ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లి బస్సెక్కారు. బస్టాండ్లో వందల మంది మహిళలుంటే పదుల సంఖ్యలో పురుషులు కనిపించడం విశేషం. బస్సు వద్ద ప్రయాణం చేయడం కోసం మహిళలు కుస్తీపడుతున్నారు. బస్టాండులోనే ఇలా ఉంటే మరి బస్సులో మరీ దారుణం.