సంగారెడ్డి జనవరి 5(నమస్తే తెలంగాణ): ఐఐటీ హైదరాబాద్లో ఇన్వెంటివ్ 2024 నిర్వహించటం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, రెండురోజులపాటు నిర్వహించే మెగా ఇన్వెంటివ్ ఫెయిర్ను విజయవంతం చేస్తామని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. 19, 20 తేదీల్లో జరిగే ఇన్వెంటివ్ ఫెయిర్లో 120 కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఆవిష్కరణలు ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక విద్యాసంస్థల్లో జరిగే పరిశోధనల ఫలితాలతో దేశ ఆర్థికవ్యవస్థ మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. అయితే పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలు సాంకేతిక విద్యాసంస్థతో కలిసి పనిచేయటంతోపాటు పరిశోధనలకు మరింత ఎక్కువగా నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఐఐటీలు, ఇంజినీరింగ్ విద్య వైపు విద్యార్థులు ఆసక్తిచూపటంలేదన్న విలేకరుల ప్రశ్నను డైరెక్టర్ బీఎస్ మూర్తి కొట్టి పారేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇంజినీరింగ్ చేసేందుకు ఆసక్తిచూపుతున్నారని ఇందుకు సాంకేతిక విద్యాసంస్థల్లో ఏటా విద్యార్థుల సంఖ్య పెరగటమే నిదర్శనమన్నారు. మొదటితరం ఐఐటీలతో పోలిస్తే రెండోతరం ఐఐటీలు మంచి ఫలితాలు, ర్యాంకింగ్లు సాధించటంలేదన్న విమర్శలు సహేతుకం కాదన్నారు. రెండోతరం ఐఐటీలు మంచి ఫలితాలు, ర్యాంకులు సాధిస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ కొత్త ఆవిష్కరణలతోపాటు ఇతర అంశాల్లో దేశంలో మూడోస్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ ద్వారా 135 స్టార్టప్ కంపెనీలు ప్రారంభమై రూ.1200 కోట్ల రెవెన్యూ సాధిస్తున్నట్లు చెప్పారు. 19, 20న జరిగే ఇన్నోవేషన్ ఫెయిర్లో కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించటంతోపాటు ప్యానెల్ డిస్కషన్లు ఉంటాయని తెలిపారు. అలాగే 20న మధ్యాహ్నం కళాశాల విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఏఐతో రోడ్డు ప్రమాదాల నివారణ
కృత్రిక మేథ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సా యంతో రోడ్డు ప్రమాదాల నివారించేలా కొత్త ఆవిష్కరణలను రూపొందించినట్లు ఐఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజేనారాయణన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నోవేషన్ ఫెయిర్లో తమ సంస్థ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఇటీవల తమ సంస్థ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో కొత్త పరికరాలను రూపొందించినట్లు చెప్పారు. నాగ్పూర్లోని ప్రభుత్వ ప్రజా రవాణా వాహనాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. త్వరలో తెలంగాణలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ కోసం తాము రూపొందించిన ఏఐ టూల్స్ను వినియోగించనున్నట్లు చెప్పారు. వరంగల్ నిట్ డైరెక్టర్ విద్యాధర్ సుబుధి మాట్లాడుతూ ఇన్వెంటివ్ 2024లో ఎన్ఐటీలు పాలుపంచుకోనున్నట్లు తెలిపారు. ఎన్ఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణలన ప్రదర్శిస్తారని చప్పారు. ఇన్నోవేషన్ ఫెయిర్తో పరిశ్రమలు, సాంకేతిక విద్యాసంస్థల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. సమావేశంలో ఐఐటీ ప్రొఫెసర్లు చంద్రశేఖర్ శర్మ, సూర్యకుమార్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.