భాషకు అందని భావం అమ్మ
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం
20ఏండ్లుగా ఇద్దరు కొడుకులకు సపర్యలు చేస్తున్న తల్లి
తల్లికి అసలైన నిర్వచనం కొండ నిర్మల
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.. ఇది ఓ సినిమా డైలాగ్.. నిజమే మరి.. బిడ్డకు ఏ కష్టం రాకుండా ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతంది.. అది మనిషైనా.. జంతువైనా.. పక్షి అయినా.. ఎందాకైనా వెళ్తుంది.. మనిషి జీవితానికి ఈ ప్రకృతి ఎంతో ముఖ్యమో.. బిడ్డ ప్రకృతిని చూడటానికి అమ్మే మార్గదర్శకం. భాషకు అందని భావం అమ్మ.. ఆది గురువు అమ్మే. తల్లిని మించిన ప్రేమమూర్తి ప్రపంచంలో లేదు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు మీ కోసం..
సృష్టికి మూలం అమ్మ..! తెలుగు అక్షరాల్లో ఆది అక్షరం అమ్మే. అంత విలువైన అమ్మని తెలుసుకోవాలంటే.. ప్రకృతిని తెలుసుకున్నట్లే.. ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు కాబట్టి, మనిషి జీవితానికి ఈ ప్రకృతి ఎంతో ముఖ్యమో.. బిడ్డ ప్రకృతిని చూడటానికి అమ్మే మార్గదర్శకం. భాషకు అందని భావం అమ్మ.. ఆది గురువు అమ్మే. తల్లిని మించిన ప్రేమమూర్తి ప్రపంచంలో లేదు. ప్రపంచం ఆధునికతతో తనరూపం మార్చుకున్నా, అమ్మతో బంధం చెక్కు చెదరలేదు.. అదే అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం. కని, పెంచి, ఏమీ తెలియని వయసులో అన్ని సపర్యలు చేసి పెద్ద చేస్తుంది. పిల్లలు పెద్దవాళ్లయి తమ కాళ్లపై నిలబడితే తల్లిదండ్రులకంటే సంతోషించే వాళ్లు మరొకరుండరు. చేదోడు వాదోడుగా ఉండాల్సిన పిల్లలకే జీవితాంతం సపర్యలు చేయాల్సి వస్తే, ఆ ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుంది. అలాంటి కష్టం అనుభవించే తల్లి మనోవేదన వర్ణనాతీతం. చెట్టంతా కొడుకులను చంటి పాపలుగా సేవలు చేస్తూ.. అమ్మ అనే పదానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నది రామక్కపేటకు చెందిన మాతృమూర్తి నిర్మలమ్మ.
సృష్టికి మూలం ‘అమ్మ’
అమ్మ..! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత ఎంత చెప్పినా తక్కువే.. మా టలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసుపడిన నాటి నుంచి నవ మాసాలు మోసి ఎన్నో సమస్యలు ఎదుర్కొని అమ్మ పునర్జమ్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తాది. పొత్తిళ్లలో బిడ్డను చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. బ్రహ్మ అమ్మ ను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు..? మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కానీ అమ్మ ప్రేమ మార దు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఆమె ప్రేమలాంటిది. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తున్నది. అమ్మ.. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి, ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కన్న పేగుకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవితంలో కళ్లలో పెట్టుకొని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం.
కదల్లేని కొడుకులకు కంటికి రెప్పలా..
దుబ్బాక, మే 7 : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన కొండ నిర్మల, దుర్గయ్య చేనేత దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు జగన్నాథం(40), మనోహర్(36), కూతురు ఉన్నారు. అందరి పిల్లల మాదిరిగానే వీరు కూడా ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లారు. పెద్ద కొడుకు జగన్నాథం 9వ తరగతిలో చదువుకుంటున్న సమయంలో కాళ్లు , చేతులు చచ్చుబడ్డాయి. అదే విధంగా చిన్న కొడుకు మనోహర్(14వ ఏటా)కు కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. దవాఖానల్లో చూపించగా, కండరాల క్షీణత(మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధి అని వైద్యులు తేల్చారు. క్రమక్రమంగా కండరాల ద్రవ్యరాశిని కోల్పోవడంతో కండరాల క్షీణత వ్యాధి వస్తుంది. ఇద్దరు కొడుకులు 14ఏండ్ల వయసు రాగానే ఈ వ్యాధి బారిన పడ్డారు. గ్రామంలో పదో తరగతి వరకు చదువుకొని, వారిద్దరు ఇంటికే పరిమితమయ్యారు. ఎటూ కదలలేక.. కూర్చోన్న చోటనే వారికి తల్లి నిర్మల తన భర్త దుర్గయ్య సహాయంతో సపర్యలు చేస్తున్నది. ఒకటి రెండు కాదు.. 20ఏండ్లుగా తమ కొడుకులను కంటి పాపలుగా కాపాడుకుంటున్న ది. తమ తల్లిదండ్రుల బాధను చూడలేక జగన్నాథం, మనోహర్ 15ఏండ్ల క్రితం తమ అవయవాలను దానం చేస్తామని, తమకు మరణాన్ని ప్రసాదించాలని ప్రభుత్వాన్ని, న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ఇందుకు కోర్టు తిరస్కరించింది.
చెట్టుకు కాయ భారమా.. అన్నట్లుగా..
నిర్మల తమ పిల్లల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. తమ కొడుకులకు కొండంత ధైర్యం అందిస్తూ అండగా ఉంటున్నది. తమ పిల్లలే తమ లోకంగా భావిస్తున్నది. నిత్యం కంటి పాపలా కాపాడుతూ చంటి పిల్లల్లా సేవలు చేస్తున్నది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జగన్నాథం, మనోహర్కు మందులు, భోజనం అందిస్తున్నది. పిల్లలను వదిలి ఎక్కడికి వెళ్లదు. ప్రస్తుతం నిర్మల 60ఏండ్లు, వృద్ధాప్యం దరి చేరటంతో తమ పిల్లలకు సపర్యలు చేయడం ఆరోగ్యం సహకరించలేక పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. తాము లేకపోతే బిడ్డల పరిస్థితి ఏమిటా? అని ఆ తల్లి ఆందోళన చెందుతున్నది. ప్రస్తుతం ప్రభు త్వం అందిస్తున్న దివ్యాంగుల పింఛన్ ఇద్దరు కొడుకులకు రూ.3 వేలు చొప్పున, తనకు వస్తున్న బీడీ పింఛన్ రూ.2 వేలతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నది.
మా తర్వాత ఎవరు చూస్తారనేదే మా బెంగ
మాది మేనరిక వివాహం. మాకు ఇద్దరు కొడుకులు, కూతురు. మాది చేనేత కుటుంబం. చేనేత పనితో పాటు బీడీలు చుడితే వచ్చే కూలీ డబ్బులతో ఎంతో సంతోషంతో కుటుంబం కొనసాగింది. ఇది 20ఏండ్ల కిందట వరకు.. అప్పటి నుంచి విధి ఆడిన నాటకంలో మా ఇద్దరు కొడుకులు కండరాల క్షీణత వ్యాధితో గడప దాటలేక, ఇంట్లోనే ఉంటున్నారు. కనీసం వారి పనులు కూడా చేసుకోలేని దుస్థితి. పొద్దున నిద్రలేచిన నుంచి రాత్రి పడుకునే వరకు సపర్యలు చేయాల్సి ఉంటుంది. మా పిల్లలు ఇప్పటికీ మాకు చంటి పాపలే. చంటి పాపలు వేరు.. వీరు వేరు.. వారికి స్నానం చేయించాలన్నా.. ఏదైనా దగ్గరుండి చేయాలి. వారు బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి. వారికి భోజనం, నీళ్లు, మందులు గమనిస్తూ ఇవ్వాలి. ప్రస్తుతం మేము వృద్ధాప్యంలోకి వచ్చాం. మాకు ప్రాణం ఉన్నంత వరకు పిల్లలను చూసుకుంటాం. మాకేమైనా అయితే, వారి పరిస్థితి గురించే మా బెంగ.
– కొండ నిర్మల
తల్లికి గుడి కట్టి..
తల్లి జ్ఞాపకాలను పదిలం చేసుకొని, ఆమెకు గుడి కట్టి నిత్యపూజలు చేస్తున్నాడు ఓ తనయుడు. ఎక్కడో ఉద్యోగం చేసి, విశ్రాంత జీవితాన్ని స్వగ్రామం లో అమ్మ జ్ఞాపకాలతో గడుపుతున్నాడు చంద్రాగౌడ్. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్పల్లికి చెందిన కొలుగురు చంద్రాగౌడ్ తల్లిపై ఉన్న ప్రేమతో గుడి కట్టాడు. ఆమెను ఓ దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తున్నాడు. చంద్రాగౌడ్ ఎలక్ట్రీషియన్(లైన్మెన్)గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. చంద్రాగౌడ్ తల్లిదండ్రులు సత్తవ్వ, రాజాగౌడ్. రాజాగౌడ్ 2002లో మృతి చెందగా, సత్తవ్వ 2017లో చనిపోయింది. సత్తవ్వ చనిపోయిన నుంచి చంద్రాగౌడ్ అమ్మ ప్రేమను పదిలంగా పది కాలల పాటు కాపాడుకునేందుకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. గోసాన్పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అమ్మతో పాటు నాన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలిచి, గతేడాది తల్లిదండ్రుల విగ్రహాలు ఏర్పాటు చేశాడు. సత్తవ్వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. రోజు పొలం వద్దకు వచ్చి అమ్మానాన్న విగ్రహాలకు పూజలు చేశాకే ఇతర పనులు చేస్తాడు.
అమ్మతోనే నాకు గుర్తింపు..
మా తల్లిదండ్రులకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఐదుగురు అన్నదమ్ములు. నేను మూడోవాడిని. మాది పెద్ద కుటుంబమైనా, మా అమ్మ అందరినీ ఒకే ప్రేమతో చూసేది. వ్యవసాయ పనులు చేస్తూ మమ్మల్ని చదివించి, ఉన్నతులుగా తీర్చిదిద్దింది. నాన్న అంటే భయం ఉన్నప్పటికీ అమ్మతోనే ఎక్కువ సమయం గడిపేవాళ్లం. నిజామాబాద్లో లైన్మెన్గా ఉద్యోగం చేసి, రిటైర్డ్ అయ్యాను. విశ్రాంత జీవితం స్వగ్రామంలో గడుపుతున్న. ఇంట్లో, వ్యవసాయ పొలంలో అమ్మ జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అందుకే అమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నా. రోజు పొలం వద్దకు వచ్చి అమ్మానాన్నలకు పూజలు చేయడం దినచర్యగా మారింది.
– కొలుగురు చంద్రాగౌడ్, గోసాన్పల్లి