డివిజన్ పరిధిలో అసంపూర్తి పనులన్నీ వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. గురువారం నారాయణఖేడ్ ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖల మండలాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం త్వరగా స్థలాలను ఎంపిక చేసి నిర్మాణాలు చేయాలన్నారు. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, దాతల సహకారంతో క్లస్టర్కు ఒక వైకుంఠ రథాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం నారాయణఖేడ్ పట్టణంలో రూ.65లక్షలతో ప్రారంభించిన ఆక్సిజన్ పార్కును సందర్శించి సదుపాయాలపై ఆరాతీశారు. నిజాంపేటలో తహసీల్ కార్యాలయం కోసం ఎంపిక చేసిన భవనాన్ని పరిశీలించారు.
నారాయణఖేడ్, అక్టోబర్ 20 : నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. గురువారం నారాయణఖేడ్ ఎంపీడీవో కార్యాలయ సమావేశమందిరంలో ఆయా మండలాల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాల ఎంపికను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణపు పనులు చేపట్టాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విధిగా పౌష్టికాహారాన్ని అందజేయాలన్నారు. ధరణి సమస్యలను పరిష్కరించాలన్నారు. సర్కారు దవాఖానల్లోనే ప్రసవాలు జరిగే విధంగా వైద్యాధికారులు చొరవ చూపాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్రావు, డీపీవో సురేశ్ మోహ న్, జిల్లా వ్యవసాయాధికారి నర్సింహరావు, స్థానిక ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ పార్క్ పరిశీలన..
నారాయణఖేడ్ పట్టణంలో రూ.65 లక్షలతో నూతనంగా ప్రారంభించిన ఆక్సిజన్ పార్క్ను గురువారం కలెక్టర్ శరత్ పరిశీలించారు. సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన క్యాంటిన్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యాలయం కోసం భవనం పరిశీలన
నూతనంగా ఏర్పాటైన నిజాంపేట్ మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయానికి భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. కాగా, నిజాంపేట్లో ఏర్పా టు చేసిన క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన సందర్భంగా తమకు క్రీడా ప్రాంగణానికి సంబంధించిన బిల్లులు చెల్లించలేదని సర్పంచ్ జగదీశ్వర్చారి కలెక్టర్ దృషికి తీసుకువచ్చారు. కలెక్టర్ అప్పటికప్పుడు వెంటనే బిల్లులు చెల్లించాల్సిందిగా ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు.