మెదక్, మే 16(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో తెల్లరాయి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. నిత్యం టన్నుల కొద్దీ తెల్లరాయిని వ్యాపారులు పన్నులు చెల్లించకుండా మెదక్ జిల్లా నుంచి హైదరాబాద్తో పాటు విదేశాలకు తరలిస్తున్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్, పెద్దశంకరంపేటతో పాటు పలు మండలాల్లో అనుమతులకు మించి తవ్వకాలు చేసినా, గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కంటే అధికంగా తవ్వకాలు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారులు అక్రమంగా తవ్వకాలు చేసి ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. వ్యాపారులు భూమిని లీజుకు తీసుకొని అంతకు మించి రెండింతలు తెల్లరాయి కొల్లగొడుతున్నారు. మార్కెట్లో తెల్లరాయికి భారీగా డిమాండ్ ఉండడంతో వ్యాపారులు ప్రతినెలా గనులు, రెవెన్యూ, పోలీస్శాఖకు మామూళ్లు ఇచ్చి వ్యాపా రం కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇతరత్రా రూపాల్లో రావాల్సిన ఆదాయానికి భారీగా గండికొట్టి దండిగా సంపాదిస్తున్నారు.
నామమాత్రంగా లీజుకు తీసుకొని తవ్వకాలు
మెదక్ జిల్లాలో కొందరు వ్యాపారులు తెల్లరాయి తవ్వకాలు చేసేందుకు నామమాత్రంగా అనుమతులు తీసుకొని భారీగా తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి నామమాత్రంగా భూమిని లీజుకు తీసుకొని, అంతకు మించి రెండింతలు వ్యాపారులు అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. అక్రమంగా తెల్లరాయి వ్యాపారం జోరుగా సాగుతున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ మొత్తంలో మూడుపులు ముట్టడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్, కొల్చారం, హవేళిఘనపూర్ మండలాల్లో తెల్లరాయి నిక్షేపాలు ఉన్నాయి. అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేసి తవ్వకాలు చేపట్టి రవాణా చేస్తున్నారు.
తెల్లరాయిని వ్యాపారులు అక్రమంగా ఫ్యాక్టరీలకు తలిస్తున్నా, సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పరోక్షంగా భాగస్వామ్యం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెల్లరాయిని సిరామిక్ టైల్స్ కోసం ఎక్కువగా వినియోగిస్తారు. మార్కెట్లో టన్నుకు రూ. 30 వేల వరకు ధర ఉంది. మెదక్ జిల్లాలో భూగర్భ గనుల శాఖ నుంచి పెద్దశంకరంపేట, కొల్చారం, హవేళీ ఘనపూర్ మండలాల్లోని క్యారీల నుంచి తవ్వకాలకు అనుమతి ఉంది. మెదక్ మండలంలోని వ్యాపారులు తెల్లరాయిని నిల్వ చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు.
అక్రమ తవ్వకాల సమాచారం బయటకు రాకుండా ఉండేందుకు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నారు. తెల్లరాయి క్వారీలో యథేచ్ఛగా జిలెటిన్స్టిక్స్ పేలుళ్ల చేస్తున్నా, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు ప్రభుత్వ నింబంధనలకు విరుద్ధంగా డ్రిల్లింగ్ చేసి జిలెటిన్ స్టిక్స్ పేలుస్తున్నారు. మైనింగ్ తవ్వకాలు చేసేందుకు వ్యాపారులు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలి కానీ, ఎక్కడా తీసుకుంటున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోయినా గనులు, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలకు తావిస్తున్నది.