సంగారెడ్డి, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాకు తలమానికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ 15 వసంతాలు పూర్తి చేసుకుంది. శుక్రవారం (నేడు) క్రిస్టల్ ఇయర్ వేడుకలను నిర్వహించనున్నారు. 2008లో సంగారెడ్డి జిల్లా కందిలో దీనిని ఏర్పాటు చేశారు. మొదట స్థానిక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తాత్కాలిక తరగతులు ప్రారంభించారు. ఆ తర్వాత కందిలో ఐఐటీ హైదరాబాద్లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం 576 ఎకరాలు కేటాయించింది. 2009 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులకు జపాన్ ఆర్థిక సహాయం చేసింది. 2011 నుంచి 2019 మధ్య కాలంలో మొదటి దశ క్యాంపస్ నిర్మాణ పనులు జరిగాయి. హాస్టల్స్, అకడమిక్ భవనాలు, స్టాప్ భవనాల నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతం రెండో దశ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్లో ఐఐటీ రీసెర్చ్ పార్కు, టెక్నికల్ రీసెర్చ్ పార్కు, టీహాన్లు ఏర్పాటు చేశారు. 15 సంవత్సరాల వ్యవధిలో అనేక కొత్త కోర్సులను ఐఐటీహెచ్ ప్రవేశపెట్టింది. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ ప్రోగ్రామ్లతో పాటు అనేక కొత్త కోర్సులు ప్రారంభించింది. ఎమ్మెస్సీ లైఫ్ సైన్సెస్తో పాటు లిబరల్ ఆర్ట్స్ కోర్సులు ప్రవేశపెట్టింది. మొత్తం 18 విభాగాల్లో 300 మంది అధ్యాపకులు ఉన్నారు. 4299 మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్నారు.
200కు పైగా స్టేట్ అఫ్ ది ఆర్ట్ లేబరేటరీలు, ఐదు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. పరిశోధనలపై ఐఐటీ హైదరాబాద్ ఎక్కువగా దృష్టి పెడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మానవ రహిత వాహనాల తయారీ, ఏరోస్పేస్లలో ఎక్కువగా పరిశోధనలు జరుపుతున్నది. దేశంలో 5జీ, 6జీ టెక్నాలజీ తెచ్చేందుకు పరిశోధనలు జరుపుతున్నది. 5జీ టెక్నాలజీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది. ఐఐటీ హైదరాబాద్కు చెందిన 8వేలకు పైగా పరిశోధన పత్రాలు దేశ, విదేశ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. 125కు పైగా స్టార్టప్స్ వచ్చాయి. వీటితో రూ.800 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. పరిశ్రమలు, ఇతర ఏజెన్సీలతో కలిసి ఐఐటీ హైదరాబాద్ 1668 నూతన ప్రాజెక్టులపై పనిచేస్తోంది. ఏటా ఎంతోమంది విద్యార్థులను శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దుతోంది. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. తైవాన్తో కలిసి సెమీ కండక్టర్స్, చిప్ డిజైన్ల తయారీపై పరిశోధనలు చేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని కోర్సులు, పరిశోధనలు జరిపేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకుంది. శుక్రవారం నిర్వహించే వేడుకలకు భారత్ బయోటెక్ కంపెనీ చైర్మన్ కృష్ణా ఎల్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
సెకండ్ జనరేషన్ ఐఐటీల్లో ఏర్పాటైన హైదరాబాద్ ఐఐటీ 15 ఏండ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల ఈ ప్రయాణంలో ఐఐటీహెచ్ ఎన్నో మైలు రాళ్లను అధిగమించింది. దేశానికి ఉపయోగపడే అత్యుత్తమ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులను రూపొందించడంలో ఐఐటీహెచ్ కీలకపాత్ర పోషిస్తున్నాం. దేశంలోనే ఉన్నతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధ్దితో కృషి చేస్తున్నాం. ఐఐటీలో చేరే విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం. విద్యార్థులకు ఉపయోగకరమైన కోర్సులు ప్రవేశపెట్టడంతో పాటు దేశాభివృద్ధ్దికి ఉపయోగపడే పరిశోధనలు జరుపుతున్నాం. హైబ్రిడ్ క్లాసులు ప్రారంభించాం. విద్యార్థులు వర్చువల్గా తరగతులకు హాజరుకావచ్చు. -బీఎస్ మూర్తి, ఐఐటీ హెదరాబాద్ డైరెక్టర్