కంది, ఆగస్టు 21: పరిశ్రమ, ప్రాజెక్టు రంగాల అవసరాలకు మెరుగైన ఉక్కు ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా ఐఐటీహెచ్ మరో ముందడుగు వేసిందని డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఉక్కు పరిష్కారాల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రముఖ ఉక్కు తయారీదారుల్లో ఒకటైన జిందాల్ స్టీల్ సంస్థతో ఐఐటీహెచ్కు ఒప్పందం జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి ఐఐటీహెచ్లో ఈ కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక రంగాల్లో అధునాతన ఉక్కు ఉత్పత్తులను అభివృద్ధి చేసి వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. ఐఐటీహెచ్ సాంకేతిక సామర్థ్యాలను జిందాల్ స్టీల్కు చెందిన తయారీ, మెటలర్జీ, ఇంజినీరింగ్ నైపుణ్యాలతో ఈ కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. తక్కువ ముడి పదార్థాల వినియోగం, తక్కువ బరువు, మెరుగైన జీవితకాల ప్రయోజనాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, రక్షణ, విద్యుత్, రవాణా, ఇంజినీరింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
జిందాల్ స్టీల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.శర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రాజెక్టుల్లో అతి బలమైన, తేలికైన ఉక్కు వినియోగాన్ని వేగవంతం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. పరిశ్రమ, విద్యాసంస్థల సంయుక్త శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాపులు, ప్రాజెక్టులు, విద్యార్థుల ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్లు, అకడమిక్ మాడ్యూల్, పరిశ్రమలు తదితర భాగస్వామ్య కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో జిందాల్ స్టీల్ సంస్థ ప్రతినిధులు, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.