పటాన్చెరు, ఆగస్టు 1: మినీఇండియాకు మెట్రో రైలు మంజూరైంది. సీఎం కేసీఆర్ జూన్లో పటాన్చెరులో నిర్వహించిన బహిరంగ సభలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు కావాలని ప్రజల ప్రధాన డిమాండ్ను సీఎం ముందుంచారు. తక్షణం స్పందించిన సీఎం మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోను విస్తరిస్తామని హామీనిచ్చారు. 40రోజుల్లోనే మెట్రోకు ఆమోదముద్ర వేశారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగించేందుకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రూ. 60వేల కోట్ల అంచనా నిధులతో మెట్రోను పొడిగించేందుకు ప్రతిపాదించారు. దీంతో పటాన్చెరు ప్రాంత ప్రజలు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు.
భారీ ట్రాఫిక్తో అవస్థలు
భెల్ చౌరస్తా, అశోక్నగర్, బీరంగూడ కమాన్, పటాన్చెరు, రింగురోడ్డు జంక్షన్, ముత్తంగి, ఇస్నాపూర్ చౌరస్తాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండడంతో వాహనాలు బాగా పెరిగాయి. ఇస్నాపూర్ చౌరస్తాకు పాశమైలారం నుంచి వేలాది వాహనాలు రావడంతో భారీగా ట్రాఫిక్ జామయ్యేది.. ముత్తంగి రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద హోటళ్లు ఉండడం, వాహనాలు రోడ్డుపైనే నిలపడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది. ట్రాఫిక్జాంలో గంటలపాటు ప్రయాణాలు చేయాల్సి వస్తున్నది. పటాన్చెరు బస్టాండ్, భెల్ చౌరస్తాలో ట్రాఫిక్తో ప్రజలు సతమతమవుతున్నారు. నగరంలో ఉద్యోగాలు, ఉపాధి చేసుకునే ప్రజలకు బస్సుల్లో ప్రయాణం ఆలస్యం అవుతున్నది. పరిశ్రమలకు వచ్చే కార్మికులకు ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నది. నిత్యం ప్రయాణించాల్సిన వారికి ట్రాఫిక్ సమస్య తీవ్రమైన నిరుత్సాహాన్ని కలిగిస్తున్నది. పటాన్చెరు బస్టాండ్ నుంచే నిత్యం వేలాది మంది ప్రయాణికులు నగరానికి ప్రయాణిస్తుంటారు.
మెట్రో ప్రకటనతో కొత్త ఆశలు
మియాపూర్ మెట్రోస్టేషన్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నదని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నది. సీఎం ఇచ్చిన హామీ మేరకు జూలై 31న మెట్రో పొడిగింపునకు ఆమోదముద్ర వేయడం ప్రజల్లో ఆనందం నింపింది. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాపై ప్రేమతో, పారిశ్రామికవాడ అవసరాలను గుర్తించి మెట్రో రైలుకు ఆమోదం తెలిపారని ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రావడంతో అతి తక్కువ సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
మినీ ఇండియాకు మెట్రో రైలును మంజూరు చేసినందుకు పటాన్చెరు ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేశారు. అప్పుడు జరిగిన బహిరంగ సభలో ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు కావాలని ప్రజల డిమాండ్ను సీఎం కేసీఆర్ ముందుంచాను. తక్షణం స్పందించిన సీఎం ఇస్నాపూర్, పటాన్చెరు, రామచంద్రాపురంలలో ట్రాఫిక్ భారీగా పెరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే మెట్రో రైల్ను మంజూరు చేస్తామన్నారు. ఇచ్చిన హామీమేరకు మెట్రోకు ఆమోద ముద్ర వేశారు. మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగించేందుకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రూ.60వేల కోట్ల అంచనా నిధులతో మెట్రోను పొడిగించేందుకు ప్రతిపాదించారు. మెట్రోను పొడిగిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి కేటీఆర్ ప్రకటించడం ప్రజల్లో ఆనందం నింపింది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం మెట్రో రైలు. ఈ కలను సీఎం కేసీఆర్ నిజం చేసి మాకు గిఫ్ట్గా ఇచ్చారు.
– గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్యే
ఇస్నాపూర్ ప్రజల్లో కొత్త ఉత్సాహం
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును సీఎం కేసీఆర్ మంజూరు చేస్తూ క్యాబినెట్లో ఆమోదముద్ర వేయడంపై ఇస్నాపూర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇస్నాపూర్లో మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ మెట్రో రైలును పొడిగించడంతో మాకు మెట్రో ప్రయాణం చేసే అదృష్టం దక్కిందని కొనియాడారు. ట్రాఫిక్ సమస్యకు మెట్రో చక్కటి పరిష్కారమన్నారు. మెట్రో మంజూరు చేయించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి ఇస్నాపూర్ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
– బురిగారి వెంకట్రెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు..
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రోరైల్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. పటాన్చెరు ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెట్రోను ఇస్నాపూర్ వరకు తీసుకురావడంతో ఇక్కడి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మెట్రో విస్తరణతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.
– సింధూఆదర్శ్రెడ్డి, భారతీనగర్ కార్పొరేటర్
మెట్రో విస్తరణ ప్రకటన సంతోషకరం..
మెట్రో రైలుని ఇస్నాపూర్ వరకు విస్తరించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఇక్కడి ప్రజలకు తీపికబురు. మెట్రో ఈ ప్రాంతానికి రావడంతో కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజానీకానికి మేలు జరుగుతుంది. ఆర్సీపురం నుంచి సంగారెడ్డి వరకు వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ నేపథ్యంలో మెట్రో ఇస్నాపూర్ వరకు వస్తుండడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పి సుఖవంతమైన ప్రయాణం చేసే వెసులుబాటు ఉంటుంది.
– పుష్పానగేశ్, ఆర్సీపురం కార్పొరేటర్