Husband Murder | మెదక్ : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి భర్తను చంపింది ఓ భార్య. ఇక తనకేమీ తెలియనట్లు తన భర్త అదృశ్యమయ్యాడంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామంలో వెలుగు చూసింది.
షమ్నాపూర్ గ్రామానికి చెందిన శ్రీను భార్య లత, అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనేక సార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినా, లత తన పద్ధతి మార్చుకోలేదు. ఇక తన భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. దీంతో అదే గ్రామానికి చెందిన మలిశెట్టి మోహన్ అనే వ్యక్తికి రూ.50 వేలు ఇచ్చి తన భర్తను హతమార్చమని లత చెప్పింది.
పథకం ప్రకారం ఈ నెల 16న మద్యం సేవిద్దామంటూ శ్రీనుని అనంతసాగర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి బీరు సీసాతో తలపై కొట్టి హత్య చేశాడు మోహన్. ఈ నెల 28వ తేదీన తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేస్తుండగా, అనుమానంతో నిలదీయగా తామే హత్య చేశామని లత, ఆమె ప్రియుడు అంగీకరించారు.