చేర్యాల, జనవరి 23 : సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ్య పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్ వారం సందర్భంగా సికింద్రాబాద్తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సుమారు 50వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ చేసిన నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. శనివారం సాయంత్రం నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ నిర్వహణలో ఉన్న దాతల గదులు ఖాళీగా లేకపోవడంతో ప్రైవేట్ గదులను కిరాయికి తీసుకుని భక్తులు బస చేశారు. ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో స్నానాలు ఆచరించారు. గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండి స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు అభిషేకం, అర్చన, ఒడిబియ్యం పోసి, కొబ్బరి కాయలు కొట్టి, పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
వేకువజాము నుంచే దర్శనం…
ఆదివారం ఉదయం 5గంటల నుంచే మల్లన్న దర్శన భాగ్యాన్ని ఆలయ వర్గాలు కల్పించాయి. ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం, ధర్మదర్శనం తదితర కౌంటర్లను తెరిచి భక్తులకు టిక్కెట్లు విక్రయించారు.మల్లన్న దర్శనం అనంతరం భక్తులు గుట్టపైన గల ఎల్లమ్మను దర్శించుకున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు బొంగు నాగిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, ఉట్కూరి అమర్గౌడ్, దినేశ్ తివారీ, చింతల పరశురాములు, కొంగరి గిరిధర్, సాయియాదవ్, పోతుగంటి కొంరెల్లి, శెట్టె ఐలయ్య భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పలు మండలాల ఎస్సైలు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు.