ఊరి నిండా కాసుల రాసులు.. పల్లె చుట్టూ ప్రహరీ.. గ్రామంలో రెండు బురుజులు… ఇదీ కాసులాబాద్ గత వైభవం! కుండల కొద్దీ కాసులు కలిగి ఉన్నప్పటికీ ఆ గ్రామస్తులు కంటి నిండా నిద్రపోయేవారు కాదు! ఎందుకు వాళ్లకీ కష్టం? చదివేకొద్దీ తెలుసుకోవాలనిపించేంతలా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందీ పల్లె చరిత్ర. అలనాటి గొప్పలు గర్వంగా చెప్పుకుంటూ, ఆ ఆనవాళ్లను చూసి మురిసిపోతున్నారు ఆ గ్రామస్తులు… ఏది ఆ గ్రామం?
ఏమిటి ఆ గొప్పలు?! చదవండి…
మిరుదొడ్డి, మే 22: చైనా… ఈ పేరును వింటేనే చాలు ఆ దేశ రక్షణకు దేశం చుట్టూ ఏర్పాటు చేసిన పెద్ద గోడ మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇదే కోవలో కాకతీయుల కాలంలో పల్లెల పరిరక్షణకు నిర్మించిన రాతి బురుజులపై సైనికులు గస్తీ కాసేవారు. పూర్వం గ్రామల్లో దోపిడీ దొంగల నుంచి ఆస్తిపాస్తులను కాపాడుకోవడానికి గ్రామం చుట్టూ పెద్ద మట్టి, రాతి గోడలను నిర్మింపజేసి కాపాలా ఏర్పాటు చేసేవారు. ఆ మట్టి, రాతి గోడల కట్టడం ఆనవాళ్లు మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్ గ్రామంలో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.
ప్రతి ఇంటా కాసుల గలగలలు…
కాకతీయుల కాలంలో మిరుదొడ్డిని రాజధానిగా చేసుకున్న వడ్డె రాజులు కాసులాబాద్ గ్రామంపై ప్రత్యేక దృష్టిని సారించేవారని ప్రజలు చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల పంటలు పండేవని పెద్దలు చెబుతుంటారు. ఎక్కువగా ఉద్యాన పంటలు సాగుచేసేవారని ప్రతీతి. కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల తోటల సాగు ద్వారా సమకూరిన కాసులు (నాణేలు) ప్రతి ఇంట్లో కుండల నిండా ఉండేవి. ఇలా ప్రతి ఇంటా కాసుల గలగలలు వినిపించేవి. ఆ కాసులే ఈ ఊరికి కాసులాబాద్గా పేరు తెచ్చాయని చెబుతారు.
కాసులపై దోపిడీ దొంగల కన్ను…
గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంటిలో ఉన్న కాసులను కొల్లగొట్టడానికి దోపిడీ దొంగలు తరుచూ ఈ గ్రామానికి దొంగతనానికి వచ్చేవారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి నాణేలను ఎత్తుకెళ్లేవారు. దోపిడీ దొంగల భారీ నుంచి ప్రజలను కాపాడడానికి, వారు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దోపిడీ దొంగల పాలు కాకుండా ఉండడానికి అప్పటి పాలకుడు వడ్డె రాజు ప్రణాళిక రచించారు.
ఊరి చుట్టూ గోడ, బురుజుల నిర్మాణం
వాన, చలి ఎండ కాలాలను సైతం లెక్క చేయకుండా ప్రజలు కాయ కష్టం చేసి పంటలు పండించి సంపాదించిన నాణేలను దొంగలు కొల్లగొట్టకుండా ప్రజలను రక్షించడానికి గ్రామం చుట్టూ ప్రహరీ, రెండు బురుజులను నిర్మాణం చేయాలని వడ్డె రాజు సైనికులను ఆదేశించారు. వడ్డె రాజు ఆదేశాల మేరకు గ్రామం చుట్టూ ప్రహరీ, రెండు బురుజులను నిర్మించారు. దోపిడీ దొంగలు ఎక్కడానికి వీలు లేనంత ఎత్తుతో మట్టి, రాళ్లు ఉపయోగించి ఊరి చుట్టూ గోడ నిర్మించారు.
గర్వంగా ఉంది…
మా ఊరు పేరులో పైసలు ఉండడం గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లకుండా నాడు వడ్డెరాజు గ్రామ చుట్టూ మట్టి, రాతి ప్రహరీ నిర్మించిన ఆనవాళ్లు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అలనాటి బురుజులను ఈతరం వారు చూసి గర్వపడుతుంటారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఊరిలో జన్మించడం, గ్రామ ప్రథమ పౌరుడిగా సేవలందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.
– తుమ్మల బాల్రాజు, సర్పంచ్, కాసులాబాద్
బురుజుల పైనుంచి సైనికుల గస్తీ
ప్రజలను కంటికి రెప్పలా కాపాడడానికి సైనికులు రెండు బురుజుల పైకి ఎక్కి అనునిత్యం కాపలా కాసేవారు. దొంగల అలజడిని పసిగడుతూ ప్రజలను అప్రమత్తం చేసేవారని గ్రామస్తులు ఇప్పటికీ చెప్పుకుంటారు. నాడు నిర్మించిన బురుజులు, మట్టి గోడలు గ్రామం చుట్టూ ఇప్పటికీ కనిపించడం విశేషం.