న్యాల్కల్, డిసెంబర్ 20: యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు అన్నారు. మంగళవారం మండలంలోని బసంతపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన యాసంగి పంటల వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసుకుంటే తక్కువ సమయంలో పంట చేతికొస్తుందన్నారు. వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జాలలు పెరిగాయన్నారు. బిందు, తుంపర పరికరాలతో ఆరుతడి పంటలు, పండ్లు, కూరగాయాలు సాగు చేసుకుని అధిక లాభాలు పొందాలన్నారు. యాసంగిలో జిల్లాలోని 1.60 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 20 వేల ఎకరాల్లో జొన్న, శనగ, సన్ఫ్లవర్, వేరుశనగ, నువ్వులు, కుసుమ, మిరప తదితర పంటలు సాగు చేస్తున్నారన్నారు.
జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు కింద రైతులు వరిని సాగు చేసే అవకాశం ఉందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం తీసుకుంటున్న రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు. జిల్లాలో 20 వేల మంది రైతులు ఈ కేవైసీని నమోదు చేసుకోలేదన్నారు. వెంటనే రైతులందరూ తప్పకుండా ఈ కేవైసీని నమోదు చేసుకోవాలని సూచించారు. లేదంటే రాబోయో రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఆకౌంట్లో జమకావన్నారు. ఆనంతరం గ్రామంలో సాగు చేసిన పంటలను ఆడవి పందుల పాడు చేస్తున్నాయని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి లావణ్య, విస్తరణ అధికారి అజ్మత్పాష, రైతులు శ్రీనివాస్రెడ్డి, తుక్కారెడ్డి, ఇస్మాయిల్, అబ్బాస్అలీ తదితరులు ఉన్నారు.