సిద్దిపేట, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు సిద్దిపేట కలెక్టర్, ఇరిగిషన్ అడ్వైజరీ కమిటీకి మంగళవారం లేఖ రాశారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్కు హరీశ్రావు లేఖలో పలు అంశాలు కమిటీ దృష్టికి తెచ్చారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు ఏటా ఈ సమయం వరకే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసేవారని గుర్తుచేశారు. ఈసారి ఇంకా ఎత్తిపోతలు ప్రారంభించలేదన్నారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరాయని, వీటిని వెంటనే నింపాలన్నారు.
కొమురవెల్ల్లి మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్లు అడుగంటే పరిస్థితిలో ఉన్నాయని, తక్షణమే ఈ రిజర్వాయర్లలోకి 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లు నింపాలని కోరారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి రైతులకు ప్రయోజనంగా ఉంటుందని హరీశ్రావు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 65శాతం మంది రైతులే వానకాలం పంటలు సాగుచేశారని, మిగతావారు సాగునీళ్లు లేవనే ఉద్దేశంతో భూములు బీడుగా ఉంచారని తెలిపారు.
2027 జూలై వరకు ఎల్నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నదని, అప్పటి వరకు సాగు, తాగునీటికి కొరత రాకుండా ఇప్పటికిప్పుడే రిజర్వాయర్లలోకి ఎత్తిపోతలు ప్రారంభించాలని కోరారు. ఈ నీళ్ల వినియోగం పూర్తయితే మళ్లీ ఎత్తి పోయడానికి మిడ్ మానేరు రిజర్వాయర్లో సిద్దిపేట జిల్లాకు సరిపడా నీటిని స్టోరేజీ చేసి ఉంచాలన్నారు. యాసంగి సమయంలో అవసరానికి లిఫ్ట్ చేసుకొనేలా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
సుమారు 6 నుండి 7 టీఎంసీల నీళ్లు తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుందని, వరి, పామాయిల్, ఇతర పంటలు సాగుచేసిన రైతులు నీటి ఎత్తిపోతల కోసమే ఎదురుచూస్తున్నారని హరీశ్రావు తెలిపారు. రిజర్వాయర్ల దుస్థితి చూస్తుంటే దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో ప్రవాహం ఉన్నప్పుడే వడివడిగా నీటిని ఎత్తిపోస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఇకడి పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఏ కష్టం రాకుండా వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని లేఖ ద్వారా కమిటీ దృష్టికి హరీశ్రావు తీసుకెళ్లారు.