దుబ్బాక టౌన్, ఆగస్టు 6: సమైక్య రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి పాలకుల వివక్షతతో ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలైన చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దుబ్బాక ప్రాంతంలోనే సుమారు వంద మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు, ఆకలిచావులకు బలైన విషయం విదితమే. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు థ్రిప్ట్ (పొదుపు) పథకాన్ని ప్రవేశపెట్టి సహకార రంగంలో ఉన్న 75శాతం చేనేత కార్మికులకు వర్తింప చేసేలా పథకాన్ని రూపొందించింది. 18ఏండ్లు నిండిన ప్రతి చేనేత కార్మికుడికి ఈ పథకం వర్తించేలా నిబంధనలు ఖరారు చేసింది.
కార్మికుడు నెలలో సంపాదించిన వేతనంతో 8శాతం మొత్తాన్ని బ్యాంక్లో జమచేస్తే ప్రభుత్వం 16శాతం జమచేసి కార్మికుడికి అందిస్తున్నది. ఈ పథకంలో చేనేత కార్మికుడికి నెలకు 18వేల రూపాయల వేతనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. సిద్దిపేట జిల్లాలో 545 జియోట్యాగ్ చేసిన మగ్గాలు ఉండగా, 486 మంది కార్మికులు థ్రిప్ట్ పథకంలో కొనసాగుతున్నారు. వేలాది మంది కార్మికులు మాస్టర్స్ వీవర్స్ వద్ద పని చేస్తున్నారు.
నేతన్నకు బీమా ధీమా..
వ్యవసాయ రంగం తర్వాత పెద్దదైన చేనేత పరిశ్రమలో పనిచేసే కార్మికులకు బతుకు భరోసాను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేనేత బీమాను అమలుచేయాలని సంకల్పించింది. రైతులకు రైతుబీమా తరహాలోనే చేనేత కార్మికులకు చేనేత బీమాను అమలు చేయనున్నది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేటినుంచి కార్మికులకు చేనేత బీమా అమలు చేయాలని ఎల్ఐసీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. జిల్లాలో 18 నుంచి 60 ఏండ్లలోపు చేనేత కార్మికులు, వాటి అనుబంధాల్లో పని చేసే కార్మికులకు చేనేత బీమా వర్తిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 2600 పైగా కార్మికులకు ఈ పథకంతో లబ్ధిచేకూరనున్నది.
చేనేత వస్ర్తాలు ధరించేలా ప్రచారం…
చేనేత పరిశ్రమను కాపాడేందుకు కేవలం బడ్జెట్లో నిధుల కేటాయింపు, రుణాలు ఇవ్వడంతోనే సరిపోదని తెలుసుకున్న సీఎం కేసీఆర్, చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్.. పరిశ్రమకు మార్కెట్లో ఆదరణ కల్పించాలని సంకల్పించారు. ఎక్కువ మంది చేనేత వస్ర్తాలు ధరించేలా చొరవ తీసుకుంటున్నారు. చేనేత వస్ర్తాలు ధరించడంతో కలిగే ఆరోగ్యపరమైన లాభాలను ప్రచారం చేస్తూ చేనేత వస్ర్తాలకు క్రేజీని పెంచారు. అందులో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట కలెక్టరేట్లో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలు 4 రోజుల పాటు చేపట్టారు. దీనికి మంచి స్పందన లభించినట్లు అధికారులు వెల్లడించారు.
సిద్దిపేటలో నిర్వహించిన చేనేత మేళాలో వస్ర్తాలను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్
40 శాతం సబ్సిడీతో రంగులు, రసాయనాలు…
చేనేత పరిశ్రమ పది కాలాలు సజావుగా సాగి కార్మికులకు ఉపాధి లభించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టింది. రంగులు, రసాయనాలు, యారన్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో చేనేతకు ఎంత ఆదరణ ఉన్నప్పటికీ కార్మికుల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగులు, రసాయనాలు, యారన్పై 40శాతం సబ్సిడీ ఇచ్చి కార్మికులను మరింత ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. చేనేతను కొత్త పుంతలను తొక్కిస్తున్న ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. మగ్గాలను జియోట్యాగింగ్ చేసింది. కార్మికులకు గుర్తింపు నెంబర్ను కేటాయించి దళారుల ప్రమేయం లేకుండా సబ్సిడీలు, రుణాలు, పథకాలు కార్మికుడికే అందేలా చర్యలు చేపట్టింది.
చేనేత దినోత్సవం ఇలా…
స్వాతంత్య్ర సంగ్రామం జోరుగా సాగుతున్న రోజుల్లో నాటి దేశ నాయకులు జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టా రు. అందులో ప్రధాన అంశం విదేశీ వస్తువుల బహిష్కరణ. 1905లో కోల్కతా నగరంలో ఆగస్టు 7న విదేశీ వస్తువులతో పాటు విదేశీ దుస్తులను పూర్తిగా బహిష్కరిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున విదేశీ వస్ర్తాలను తగులబెట్టి జాతీయ భావానికి తెరతీశారు. నాడు విదేశీ వస్ర్తాలను ధరించకుండా స్వదేశీ వస్ర్తాలనే ధరించాలనే ఆలోచనతో ప్రజలు చేనేతకు పట్టం కట్టారు. ఆ దినాన్నే జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజున చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన వారికి అవార్డులు ఇవ్వాలని సంకల్పించారు. దీంతో ఏటా ఆగస్ట్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ ఏడాది జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ముగ్గురు కార్మికులను ఎంపిక చేయగా, జిల్లాలోని ప్రతి సొసైటీ నుంచి ఒకరిని సన్మానించనున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
చేనేత పథకాలతో కార్మికులకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నది. రైతుబీమా తరహాలో చేనేత బీమా పథకాన్ని తీసుకురావడం కార్మికుల్లో మనోధైర్యాన్ని కలిగిస్తున్నది. ఇప్పటికే చేనేతకు చేయూత, చేనేత మిత్ర పథకాల ద్వారా కార్మికులకు ప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లాలో సుమారు ఐదు వేల మంది కార్మికులు ఉండగా, 545 మగ్గాలు ఉన్నాయి. చేనేత బీమా పథకం ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానుంది. సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ తదితర చేనేత సొసైటీల్లో కార్మికులు వస్ర్తాలను అధునాతన రీతిలో తయారు చేస్తున్నారు. – ప్రవీణ్, చేనేత ఏడీవో, దుబ్బాక
చేనేత కుటుంబాలు బీమాధీమా
గతంలో ఏ ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం ఎలాంటి పథకాలు తేలేదు. కార్మికుల కుటుంబాలకు చేనేతబీమా పథకం ధీమాను ఇస్తుంది. అవసరాలకు చేనేత చేయూత పథకం గుండె ధైర్యాన్ని ఇస్తున్నాయి. చేనేత కార్మికులకు ప్రభుత్వం పింఛన్ సైతం ఇస్తున్నది.
– గుండ్ల రాజయ్య, చేనేత కార్మికుడు, దుబ్బాక