రామాయంపేట/ పెద్దశంకరంపేట/ కొల్చారం/ శివ్వంపేట/ అల్లాదుర్గం/ చిలిపిచెడ్, ఆగస్టు 9 : జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల్లో మతసామరస్యం వెల్లివిరిసేలా మొహర్రం వేడుకలు మంగళవారం జరిగాయి. పెద్దశంకరంపేటలో జరిగిన మొహర్రం వేడుకలకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరై పీర్లను దర్శించుకున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం ఉత్సవాలను హిం దూ, ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీర్లను బాజాభజంత్రీలతో పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ప్రజలు పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. రామాయంపేటలో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంతోపాటు అక్కన్నపేట, డి.ధర్మారం, కోనాపూర్, కోమటి పల్లి, కాట్రియాల తదితర గ్రామాల్లో పీర్ల ఊరేగింపు చేపట్టారు.
కొల్చారం మండలవ్యాప్తంగా పీర్లను డప్పుచప్పుళ్లతో ఊరేగించారు. అనంతరం చెరువుల్లో పీర్లను నిమజ్జనం చేశారు. శివ్వంపేట మండలకేంద్రంతోపాటు దొంతి, గూడురు, గోమారం, కొంతాన్పల్లి, ఏదుల్లాపూర్, నవాబ్పేట గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. వేడుకల్లో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ లావణ్యామాధరెడ్డి, నాయకులు మహ్మద్ షఫియొద్దీన్, లాయక్, అబ్దుల్ అజీజ్, శేక్అలీ, కైఫ్ పాల్గొన్నారు. అల్లాదుర్గం, చిలిపిచెడ్ మండలాల్లో మొహర్రం వేడుకలు నిర్వ హించారు. ప్రజలు పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.