పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ‘మనఊరు – మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ. వందల కోట్లతో ఆధునీకరించిన సర్కారు బడులు నేడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నిన్న మొన్నటి వరకు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు నేడు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. నీటిసరఫరా, టాయిలెట్లు, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, పెయింట్, మరమ్మతులు, బోర్డులు, ప్రహరీ, వంటగది తదితర సౌకర్యాలు కల్పించారు. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలను ఎంపిక చేయగా, 66 బడుల్లో అధికారులు అన్ని పనులు పూర్తి చేశారు. మెదక్ జిల్లాలో 313 స్కూళ్లను ఎంపిక చేసి, 33 బడుల్లో వసతులన్నీ కల్పించారు. మరో 258 పాఠశాలల్లో 50 శాతానికిపైగా పనులు తుది దశలో ఉన్నాయి. సిద్ధమైన వాటిని నేడు ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలను వేడుకలా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి విడత పనులు పూర్తయిన పాఠశాలల ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించనున్నారు.
సిద్దిపేట అర్బన్, జనవరి 31 : ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం ద్వారా మొదటి విడతలో ఎంపిక చేయబడి పనులు పూర్తి చేసుకున్న పాఠశాలలను బుధవారం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో ఎంపిక చేసిన 343 పాఠశాలలకుగానూ..36 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలోని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలలను ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది.
జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్న 36 పాఠశాలల్లో చిన్నకోడూరు మండలంలోని ఎంపీపీఎస్ అల్లీపూర్, దుబ్బాక మండలంలోని ఎంపీయూపీఎస్ పద్మనాభునిపల్లి, గజ్వేల్ మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ కొల్గూర్, ఎంపీపీఎస్ పిడిచెడ్, ఎంపీపీఎస్ బెజగామ, ఎంపీపీఎస్ జాలిగామ, హుస్నాబాద్ మండలంలోని ఎంపీపీఎస్ హుస్నాబాద్, ఎంపీపీఎస్ కూచనపల్లి, కోహెడ మండలంలోని జడ్పీహెచ్ బస్వాపూర్, ఎంపీపీఎస్ బీసీ కాలనీ కోహెడ, జగదేవపూర్ మండలంలోని ఎంపీపీఎస్ ఇటిక్యాల్, కొండపాక మండలంలోని ఎంపీపీఎస్ దుద్దెడ, ఎంపీయూపీఎస్ వెలికట్ట, ఎంపీపీఎస్ కుకునూరుపల్లి, మర్కూక్ మండలంలోని ఎంపీపీఎస్ చేబర్తి, ఎంపీయూపీఎస్ వరదరాజ్పూర్, మిరుదొడ్డి మండలంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల మిరుదొడ్డి, ఎంపీపీఎస్ రుద్రారం, ములుగు మండలంలోని ఎంపీపీఎస్ కొక్కండ, సిద్దిపేట రూరల్ మండలంలోని ఎంపీపీఎస్ రాఘవాపూర్, జడ్పీహెచ్ఎస్ రాఘవాపూర్, ఎంపీపీఎస్ ఇర్కోడ్, సిద్దిపేట అర్బన్ మండలంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల సిద్దిపేట, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నంబర్ 1 సిద్దిపేట, ప్రభుత్వ పాఠశాల పారుపల్లి వీధి సిద్దిపేట, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిద్దిపేట, ఎంపీపీఎస్ హనుమాన్నగర్ సిద్దిపేట, ఎంపీపీఎస్ ఇందిరానగర్ సిద్దిపేట, తొగుట మండలంలోని ఎంపీపీఎస్ ఘనపురం, వర్గల్ మండలంలోని ఎంపీపీఎస్ వర్గల్, ఎంపీపీఎస్ గుంటిపల్లి, అక్కన్నపేట మండలంలోని ఎంపీపీఎస్ గోవర్ధనగిరి, ఎంపీపీఎస్ అంతక్కపేట, బెజ్జంకి మండలంలోని ఎంపీపీఎస్ గుండారం, నంగునూరు మండలంలోని జడ్పీహెచ్ఎస్ రాజగోపాల్పేట పాఠశాలలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 66 పాఠశాలల ఆధునీకరణ
సంగారెడ్డి, జనవరి 31(నమస్తే తెలంగాణ): మన ఊరు-మనబడి కార్యక్రమంలో జిల్లాలో తొలి విడతలో ఎంపికైన 441 పాఠశాలల్లో రూ.210 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం 66 పాఠశాలల్లో పనులు వందశాతం పూర్తయ్యాయి. ఇందులోంచి 10 పాఠశాలలను సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు బుధవారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 124 ఉన్నత, 61 ప్రాథమికోన్నత, 256 ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 1862 పనులు పూర్తి కాగా, 568 పనులు కొనసాగుతున్నాయి.
మెదక్ జిల్లాలో 33 పాఠశాలలు
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 31: మనఊరు-మనబడి కార్యక్రమంతో పలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. మెదక్ జిల్లాలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మొదటి విడత ‘మనఊరు-మనబడి’కి 313 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో 33 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, 258 పాఠశాలల్లో 50 శాతానికి పైగా పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు ప్రభుత్వం రూ.7 కోట్లకుపైగా బిల్లులు చెల్లించింది. జిల్లాలో తొలి విడత పనులు పూర్తయిన 33 పాఠశాలలను స్థానిక ఎమెల్యేలు, ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించనున్నారు. హవేళి ఘనపూర్ మండలం రాజ్పేట మండల పరిషత్ పాఠశాల, అల్లాదుర్గం మండలం కైదంపల్లి ప్రాథమిక పాఠశాలల, శివ్వంపేట మండలం పిల్లుట్ల ప్రాథమిక పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభిచనున్నారని అధికారులు తెలిపారు.
ఒకే గ్రామంలో మూడు పాఠశాలలు..
న్యాల్కల్ మండలం మెటల్కుంట గ్రామంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించనున్నారు. గ్రామంలోని జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నారు. జహీరాబాద్ మండలం రంజోల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మునిపల్లి మండలం మేళాసంగం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్, అమీన్పూర్లోని ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించనున్నారు. హత్నూర మండలం బోర్పట్లలోని ప్రాథమిక పాఠశాల, వట్పల్లి మండలం నాగులపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రారంభించనున్నారు.
కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా డి. ధర్మారం బడి
రామాయంపేట, జనవరి 31: రామాయంపేట మండలం డి.ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం పునర్మిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం పాఠశాలకు రూ.75 లక్షల నిధులను మనఊరు-మనబడి ద్వారా పనులను త్వరితగతిన పూర్తి చేసింది. పాఠశాల ముఖద్వారం చూస్తేనే ఇది కార్పొరేట్ పాఠశాలను గుర్తుకు తెచ్చేలా ఉంది. మెదక్ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఈ పాఠశాలలో సౌకర్యాలను కల్పించారు. దశాబ్దం క్రితం ఉన్న పాఠశాలకు టాయిలెట్లు, మరుగుదొడ్లు సైతం లేకుండేది. ఇప్పుడు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, మరుగుదొడ్లను నిర్మించి అందంగా తీర్చిదిద్దారు.
మారిన బెజుగామ బడి ముఖచిత్రం
గజ్వేల్ రూరల్, జనవరి 31: మనఊరు-మనబడిలో భాగంగా గజ్వేల్ మండలం బెజుగామ ప్రాథమిక పాఠశాలలో పనులు పూర్తవడంతో ఈ బడి ముఖచిత్రం మారింది. ఈ పాఠశాలకు రూ.5.69 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ నిధులతో విద్యార్థులకు తాగునీరు, కరెంట్, ఫ్యాన్స్, లైట్స్, డెస్కులు, ఐదు గ్రీన్ బోర్డుల ఏర్పాటు చేశారు.
హుస్నాబాద్ స్కూలుకు కొత్త హంగులు
హుస్నాబాద్ టౌన్, జనవరి 31: హుస్నాబాద్ పట్టణంలో ప్రాథమిక పాఠశాలను మన ఊరు మనబడిలో మొదటి విడత ఎంపికచేశారు. ఈ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ బోర్డులు, సంప్, కిచెన్ షెడ్, నిరంతరం విద్యుత్ను అందించే సోలార్ ప్లాంట్, మూత్రశాలలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
కంది ప్రైమరీ స్కూల్కు జిల్లాస్థాయి గుర్తింపు
కంది, జనవరి 31: తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కింద మొదటి విడతలో కంది మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్కు జిల్లాస్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. పాఠశాలలో సుమారు రూ.15 లక్షలతో మేజర్, మైనర్ రిపేర్లు, విద్యుత్, పెయింటింగ్ తదితర వంద శాతం పనులు పూర్తి చేశారు. దాతల సహకారంతో విద్యార్థులకు క్రీడా సామగ్రి, షెడ్, కాంపౌండ్ వాల్ నిర్మించారు. విద్యార్థులకు పార్క్కు వచ్చిన అనుభూతి కల్పించేలా పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదుల్లోని నూతన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షింపజేస్తున్నాయి.