హుస్నాబాద్, మార్చి 10: ఉచిత వైద్య శిబిరాల నిర్వహణతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మేలు జరుగుతుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సర్ సీవీ రామన్ హైస్కూల్లో లయన్స్ క్లబ్(రేణుక) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ కరీంనగర్ సహా పలు పట్టణాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, కరీంనగర్లో రెండు శ్మశాన వాటికలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.
లయన్స్ క్లబ్ హుస్నాబాద్ వారు కోరితే బాడీఫ్రీజర్లు, ఒక వైకుంఠరథం మంజూరు చేయిస్తానని, ఇందుకోసం కలెక్టర్, ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. తన తండ్రిపేరిట హుస్నాబాద్కు అంబులెన్స్ను అందజేస్తానని, లయన్స్ క్లబ్ వారు నిర్వహించాలని కోరారు. ఇప్పటికే హమాలీలు, గుమస్తా కార్మికుల హెల్త్ ప్రొఫైల్ తయారుచేయించామన్నారు. లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ రజిత, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, సింగిల్విండో చైర్మన్ శివయ్య, లయన్స్క్లబ్ ప్రతినిధులు గోపాల్రెడ్డి, రాజగోపాల్రావు, నారాయణరెడ్డి, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.