సిద్దిపేట, జనవరి 12 : వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా 5వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు శాఖల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించుకొని గర్భిణులకు అందుతున్న సేవలను పరిశీలించుకోవాలన్నారు. ప్రతి గర్భిణికి మ్యాచింగ్ బ్యాచింగ్ జరపాలని ఆదేశించారు. జనవరి నుంచి గర్భిణుల నమోదు చేయాలని, 12 వారాలలోపు గర్భిణుల నమోదు వంద శాతం నిర్వహించాలన్నారు.
జనవరిలో గవర్నమెంట్ జనరల్ దవాఖాన సిద్దిపేటలో 500 ప్రసవాలు, గజ్వేల్ దవాఖానలో 450 ప్రసవాలు చేయాలని ఆదేశించారు. ఈ నెల నుంచి ప్రసవానంతరం మొదటిరోజు, మూడోరోజు హెచ్బీఎన్సీ విజిట్స్ గైనకాలజిస్ట్, పీడీయాట్రిషన్ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లోని పిల్లలకు హిమోగ్లోబిన్ టెస్టులు నిర్వహించాలని, తీవ్ర రక్తహీనతతో బాధపడే పిల్లలను దవాఖానకు తరలించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కాశీనాథ్, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రజిని, డాక్టర్ విజయరాణి , డాక్టర్ వినోద్ బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.